ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన... అరెస్టయిన 12మంది వీరే
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా 12 మందిని అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారి వివరాలు:
సుంకీ జియోంగ్, మేనిజింగ్ డైరెక్టర్, సీఈఓ
డీఎస్ కిమ్, టెక్నికల్ డైరెక్టర్
పిచ్చుక పూర్ణ చంద్ర మోహన్ రావ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్ విభాగం)
కోడి శ్రీనివాస్ కిరణ్ కుమార్, హెచ్ఓడీ, ఎస్ఎంహెచ్ ఇంఛార్జీ
రాజు సత్యనారాయణ, ప్రొడక్షన్ టీమ్ లీడర్
చెడుముపాటి చంద్రశేఖర్, ఇంజినీర్
కసిరెడ్ల గౌరీ శంకర నాగేంద్ర రాము, ఇంజినీర్
ముద్దు రాజేష్, ఆపరేటర్
పొట్నూరు బాలాజీ, నైట్ డ్యూటీ ఆఫీసర్ (ఆపరేషన్స్ విభాగం)
శిలపరశెట్టి అచ్యుత్, జీపీపీఎస్ ఇంఛార్జీ
కె. చక్రపాణి, ఇంజినీర్
కొండవలస వెంకట నరసింహ రమేశ్ పట్నాయక్, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఇంజినీర్
విశాఖలో కలకలం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించిన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం సీఎం జగన్కు నివేదికను అందజేసింది. ఘటనపై అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తేల్చింది.
దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పైన పేర్కొన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్జీ పాలీమర్స్ ప్రమాదానికి పలు లోపాలను హై పవర్ కమిటి ఎత్తిచూపింది.
మే 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పలు కమిటిలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధానమైంది హైపవర్ కమిటి.
read more ఎల్జీ పాలిమర్స్ పై విచారణకు ప్రత్యేక బెంచ్... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం
ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీకేజీకి పలు అంశాలపై హైపవర్ కమిటి ఎత్తి చూపింది. ఈ ప్రమాదానికి ఫ్యాక్టరీలో పలు లోపాలను కమిటి నివేదిక అభిప్రాయపడింది.విశాఖ పట్టణం నుండి ఈ ఫ్యాక్టరీని తరలించాలని కూడ కమిటి సూచించింది. మరో వైపు లాక్ డౌన్ నిబంధనలను కూడ కంపెనీ పాటించలేదని కమిటి ఎత్తిచూపింది.
అత్యవసర సమయంలోనూ అలారం సిస్టమ్ ను ఉపయోగించలేదని కమిటి తేల్చి చెప్పింది. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించలేదని కమిటి అభిప్రాయపడింది. కనీసం గేటు వద్ద అలారం కూడ మోగలేదని కమిటి గుర్తించింది. కనీసం ఈ అలారం మోగినా కూడ ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేది కాదని కమిటి అభిప్రాయంతో ఉంది.
ఈ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులకు భద్రతా ప్రమాణాలపై అవగాహన లేదని కమిటి తేల్చింది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరులో ఉద్యోగులు స్పందించలేదని కమిటి అభిప్రాయపడింది.
రిఫ్రిజరేషన్ కూలింగ్ సిస్టమ్ లో లోపాలు ఉన్నట్టుగా కమిటి గుర్తించింది. అత్యవసర ప్రమాదాల సమయంలో స్పందించడంలో కంపెనీ యాజమాన్యాలు స్పందించలేదని కమిటి నివేదిక తేల్చింది.
ఎం6 ట్యాంకులో ఉన్న స్టైరిన్ లిక్విడ్ లో ఉష్ణోగ్రత పెరగడంతో ప్రమాదం సంబవించిందని కమిటి నివేదిక స్పష్టం చేసింది. ప్రమాద తీవ్రత తగ్గించే రసాయనాలు కూడ తగిన స్థాయిలో లేవని కూడ కమిటి అభిప్రాయపడింది.