వివేకా హత్య కేసులో సీబీఐ వాంగ్మూలాల్లోని అంశాలు రోజుకొకటి బయటికి వస్తున్నాయి. తాజాగా వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి మీద అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలుస్తోంది.
అమరావతి : తమ కంపెనీలన్నీ వైయస్ వివేకానంద రెడ్డి పేరిటే ఉన్నాయని, ఆ బోర్డుల్లో ఆయనే డైరెక్టర్గా కొనసాగారని
Vivekananda Reddy భార్య Saubhagyamma సిబిఐకి తెలిపారు. ఏ కంపెనీలో ఆయన వాటాదారుడిగా ఉన్నారో ఆ వివరాలను పొందుపరుస్తూ సీబీఐకి పత్రాలు సమర్పించారు. నిరుడు జూన్ 13, 24, ఆగస్ట్ 27 తేదీలలో సిబిఐ అధికారుల ఎదుట ఆమె వాంగ్మూలాన్నిఇచ్చారు. తన భర్త కళ్లద్దాలు లేకుండా రాయలేరు అని తెలిపారు. Viveka Murderకు గురైన రోజు (2019 మార్చి 15న) ఆయన బెడ్ రూమ్ లో తీసిన వీడియో ఫుటేజీ లో కనిపించిన కళ్ళద్దాల కవర్లు రెండింటిలో ఒకటి పులివెందులలోని జ్యోతి ఆప్టికల్స్ వద్ద కొన్నట్లు తెలిపారు.
తన భర్త వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న షేక్ దస్తగిరి (ఈ హత్య కేసులో నిందితుడు, తర్వాత అప్రూవర్ గా మారాడు) తరచూ ఆయన వద్ద చిన్న చిన్న మొత్తాల్లో అప్పులు తీసుకునేవాడని వైయస్ సౌభాగ్యమ్మ సీబీఐకి చెప్పారు. ఆ సొమ్ము తిరిగి చెల్లించే వాడో, లేదో తనకు తెలియదన్నారు. దస్తగిరి అతని సోదరి పెళ్లి కోసం అప్పు అడగగా.. 2018 డిసెంబర్ 16న ప్రామిసరీ నోటు రాయించి రూ. 95000 ఇచ్చానని తెలిపారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని డ్రైవర్ ప్రసాద్ ద్వారా అడిగించినా అతను ఆ సొమ్ము ఇవ్వలేదన్నారు. తన భర్త వద్ద నుంచి దస్తగిరి రూ. 50వేలు తీసుకుని సునీల్ అనే విషయం తనకు తెలియదని చెప్పారు.
ఇదిలా ఉండగా, వైయస్ వివేకానంద రెడ్డితో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డికి అటు రాజకీయంగా, ఇటు బంధుత్వ పరంగా శత్రుత్వం ఉందని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతపేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య ఘటనలో ప్రమేయానికి సంబంధించిన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సహా ఎవరెవరిపై తనకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి…వాటికి కారణాలేంటో సీబీఐకి ఆమె చెప్పారు.
వివేకా చనిపోయాక హత్యా స్థలంలో ఆధారాలు తుడిచేయాలని భాస్కర్ రెడ్డి తనను ఆదేశించినట్లుగా గంగిరెడ్డి చెప్పడం కూడా ఆయనపై తన అనుమానానికి కారణంగా పేర్కొన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఒక్కోసారి ఒక్కొక్కరి పేరు చెప్పారన్నారు. ఇంకా ఆమె అనుమానితులుగా పేర్కొన్న వారిలో కొందరు వివరాలు, వారిని అనుమానించడానికి ఆమె చెప్పిన కారణాలు ఇవి…
దేవిరెడ్డి శివశంకర్రెడ్డి..
అవినాష్ కుటుంబానికి సన్నిహితుడు. వివేకానంద రెడ్డి అంటే శివశంకర్ రెడ్డి కి భయం. ఆయనకు ఎదుట పడే వారు కాదు. వివేకా ఇంట్లోకి ఆయన అడుగు పెట్టే వారే కాదు. అలాంటి శివ శంకర్ రెడ్డి… మార్చి 15న ఉదయం వివేకా హత్య జరిగిన ప్రదేశం నుంచి అవినాష్రెడ్డి వెళ్లిపోయాక కూడా అక్కడే ఉన్నారు. శివశంకర్ రెడ్డిపై గతంలో చాలా నేరారోపణలు ఉన్నాయి. 2017లో వివేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆయన కారణం. సంఘటన జరగడానికి ముందు రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఎర్ర గంగిరెడ్డి ఆయన ఫోన్ చేశాడు. వివేక మృతదేహాన్ని చూడడానికి ముందు ఒకసారి, చూసిన తర్వాత ఒకసారి సాక్షి విలేకరి శివశంకర్రెడ్డి ఫోన్ చేశారు. ఉదయం 6.24కి 141 సెకన్లు, ఉదయం 6.46కి 17 సెకన్లు ఆయనతో మాట్లాడారు.
