జనసేనలో చేరేది లేదు, పవన్ కు చెప్పా: విష్ణురాజు
పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి అడ్వయిజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకు అంగీకరించానని చెప్పుకొచ్చారు. విద్యా, ఉపాధి రంగాల్లో అభివృద్ధికి సహకరించేందుకే పార్టీ విధాన రూపకల్పన కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ కు స్పష్టం చేసినట్లు తెలిపారు.
భీమవరం: తాను రాజకీయాల్లోకి రాను అని ముందే స్పష్టం చేశానని అదే మాటకు కట్టుబడి ఉన్నానని బీవీ రాజు గ్రూపు కంపెనీల చైర్మన్ కేవీ విష్ణురాజు స్పష్టం చేశారు. తాను జనసేన పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలు సరికాదన్నారు.
పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి అడ్వయిజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకు అంగీకరించానని చెప్పుకొచ్చారు. విద్యా, ఉపాధి రంగాల్లో అభివృద్ధికి సహకరించేందుకే పార్టీ విధాన రూపకల్పన కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ కు స్పష్టం చేసినట్లు తెలిపారు.
తాను పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు ఇదే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఇకపోతే బీవీ రాజు గ్రూపు కంపెనీల ఛైర్మన్ గా కె.వి.విష్ణురాజు పనిచేస్తున్నారు. పద్మభూషణ్ బీ.వీ.రాజు మనవుడుగా విష్ణురాజు అందరికీ సుపరిచితులు.
ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విష్ణురాజును జనసేనలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు పవన్ తెలిపారు. అంతేకాదు రాబోయే తరానికి మంచి భవిష్యత్తును ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్న వారిలో విష్ణురాజు ఒకరని, భీమవరం వెళ్లినపుడు ఆయన కాలేజీలను నిర్వహిస్తున్న విధానాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు.
విధానాల రూపకల్పనలో రాజు ఆలోచనలు ఎంతగానో ఉపకరిస్తాయని భావిస్తున్నానని, ఆయనను కలవడం సంతోషంగా ఉందన్నారు. స్మార్ట్ సిటీలు, పర్యావరణం అంశాలపై ఆయనకు అపారమైన అవగాహన ఉందని, జనసేన విధానాల రూపకల్పనలో ఆయన సలహాలు తోడ్పాటును అందిస్తాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
వెంటనే విష్ణురాజును జనసేన విధానాల రూపకల్పన కమిటీ ఛైర్మన్ గా నియమిస్తున్నట్లు తెలిపారు. పార్టీకి అవసరమైన సేవలు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సమాజానికి మంచి చేయాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఆలోచనలు ముందుకు సాగుతున్నాయని విష్ణురాజు ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అదే సందర్భంలో తాను జనసేన పార్టీలో చేరనని కానీ పార్టీ విధానాల రూపకల్పన కమిటీ చైర్మన్ గా ఉంటానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే విష్ణు రాజు అమెరికాలోని డూపాంట్ కంపెనీలో కెమికల్ ఇంజినీర్ గా కెరియర్ ను ప్రారంభించారు.
1992లో స్వదేశానికి తిరిగి వచ్చి రాశి సిమెంట్స్, అంజనీ సిమెంట్స్ కంపెనీలకు ఎండీగా పనిచేశారు. తాత బీవీ రాజు ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా ఆయన అడుగుల వేసేవారు. డాక్టర్ బి.వి.రాజు చనిపోయిన తర్వాత బి.వి.రాజు ఫౌండేషన్, శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలకు 2002 నుంచి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
వీటితోపాటు వెన్నార్ కెమికల్స్, రాశీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్, ఆదిత్య హోటల్స్, సూపర్ మార్కెట్స్, ఎంఎఫ్ఎల్ నెట్ సర్వీసెస్, ఎలికో లిమిటెడ్, అంజనీ బేకరీ ప్రొడక్ట్స్ సంస్థల్లో డైరెక్టర్ గా ఇప్పటికీ కొనసాగుతున్నారు.