డబ్బు కోసమే తన భార్య, కుమారుడిని హేమంత్ కిడ్నాప్ చేశాడని ఆరోపించారు విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. తన కోడలు వూరెళ్లడంతో ఆమె సేవ్ అయ్యిందని ఆయన పేర్కొన్నారు.
విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్యా, కుమారుడిని దుండగులు కిడ్నాప్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అయితే హుటాహుటిన స్పందించిన పోలీసులు ఎంపీ కుటుంబ సభ్యులను రక్షించారు. దీనిపై ఎంవీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మూడ్రోజుల క్రితం కిడ్నాపర్ హేమంత్ తన ఇంట్లోకి చొరబడ్డాడని తెలిపారు. కిడ్నాపర్ హేమంత్ ఎవరో తనకు తెలియదని.. అతనిపై గతంలో కిడ్నాప్ కేసులు, మర్దర్ కేసులు వున్నాయని చెప్పారు. తొలుత తన కొడుకుని నిర్బంధించి అతనితో నా భార్యకు ఫోన్ చేశాడని.. ఆమె ఇంటికి వెళ్లగా తన భార్యను కూడా కిడ్నాప్ చేశాడని ఎంపీ తెలిపారు. ఆ తర్వాత తన స్నేహితుడు జీవిని కూడా ఇంటికి పిలిపించి కిడ్నాప్ చేశాడని సత్యనారాయణ వెల్లడించారు. తన కోడలు వూరెళ్లడంతో ఆమె సేవ్ అయ్యిందని ఆయన పేర్కొన్నారు.
నిన్న ఉదయం జీవితో ఫోన్లో మాట్లాడితే తర్వాత చేస్తానని కాల్ కట్ చేశాడని.. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఎంపీ తెలిపారు. చివరిసారి ఫోన్ లిఫ్ట్ చేసి శ్రీకాకుళంలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని చెప్పి పెట్టేశాడని సత్యనారాయణ వెల్లడించారు. ఇవాళ ఉదయం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని.. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎంపీ పేర్కొన్నారు. పోలీసులు ట్రాక్ చేయగా రిషి కొండలోనే లోకేషన్ చూపించిందన్నారు. డబ్బుల కోసమే హేమంత్ నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆరోపించారు.
ALso Read: విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతం : నా భార్య, కొడుకు, ఆడిటర్ క్షేమంగా ఉన్నారు.. ఎంపీ ఎంవీవీ
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాజకీయాల్లోకి రాకముందు నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆ కంపెనీలకు అడిటర్ గా ఆయన మిత్రుడు జీవీ వ్యవహరిస్తున్నారు. అయితే వ్యాపారంలో గొడవలు కానీ పాత కక్షలు కానీ కిడ్నాప్కు కారణమా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మరోవైపు విశాఖ నగరంలో గత కొంతకాలంగా నేరాలు పెరుగుతూ వుండటం.. ఈసారి ఏకంగా ఎంపీ ఇంట్లోకి ప్రవేశించి ఆయన భార్యా , కుమారుడిని అపహరించుపోవడంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు.