విజయవాడ టీడీపీ నెలకొన్న విభేదాలపై ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబం అన్నాక రకరకాల మనస్తత్వాలుంటాయని.. ఇవన్నీ సాధారణమన్నారు.
విజయవాడ టీడీపీ నెలకొన్న విభేదాలపై ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబం అన్నాక రకరకాల మనస్తత్వాలుంటాయని.. ఇవన్నీ సాధారణమన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీలో విభేదాలు లేవా.. షర్మిలకు, జగన్కు, తల్లికి విభేదాలు లేవా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్నొక పార్టీ పెట్టారు.. చెల్లి షర్మిల ఒక పార్టీ పెట్టబోతున్నార.. వాళ్లకున్నాయిగా విభేదాలు.. ఇవన్నీ మాములేనని నాని తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేస్తే జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ఎంపీ సవాల్ విసిరారు.
జగన్కు అంత కాన్ఫిడెన్స్ ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ కార్పోరేషన్ టీడీపీదేనని నాని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 75 నుంచి 80 శాతానికిపైగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోబోతోందని కేశినేని నాని జోస్యం చెప్పారు.
విజయవాడలో 64 డివిజన్లు ఉంటే అందులో 45 నుంచి 50 వరకు టీడీపీకే వస్తాయన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తన 20 నెలల పాలనలో అతనిపై అతనికే నమ్మకంలేదని... అందుకే టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఒక్క విజయవాడలోనే టీడీపీ అభ్యర్థులు ధైర్యంగా నిలబడగలిగారని నాని వెల్లడించారు. విజయవాడలోని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరు కూడా నామినేషన్ల ఉపసంహరణకు లొంగేవారు కాదని నాని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. భయపెట్టడం, డబ్బులు ఆశచూపి లోబర్చుకోవడం, రకరకాలుగా ఏదో విధంగా ప్రలోభాలకు గురిచేయడం, పోలీసులను అడ్డంపెట్టుకుని గెలుస్తున్నారంటూ కేశినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
