4 రోజులు రోడ్లపై 40 రోజులు హైద్రాబాద్లో: పవన్పై నాని నిప్పులు
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్కు అసలు రైతుల సమస్యల గురించి ఏ మాత్రం అవగాహన లేదని ఆయన నిప్పులు చెరిగారు.
విజయవాడ:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్కు అసలు రైతుల సమస్యల గురించి ఏ మాత్రం అవగాహన లేదని ఆయన నిప్పులు చెరిగారు.
ఆదివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రైతాంగం సమస్యలు పరిష్కరించి... వారి సంక్షేమం పాటుపడుతున్న చంద్రబాబునాయుడుపై పోరాటాన్ని నిలిపివేయాలని ఆయన పవన్ కళ్యాణ్ సూచించారు.
రాష్ట్ర హక్కుల కోసం మోడీపై పోరాడాలని ఆయన పవన్ కు హితవు పలికారు. నాలుగు రోజులు రోడ్లమీద తిరిగి 40 రోజుల పాటు హైద్రాబాద్లో ఉండే పవన్ కళ్యాణ్ కు ప్రజా సమస్యలు తెలుసా అంటూ ఆయన విమర్శించారు.
పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషీయన్ కాదన్నారు. పవన్ వ్యాఖ్యలను పెద్దగా సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరమే లేదని కేశినేని నాని అభిప్రాయపడ్డారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని తొలుత చెప్పిన కేంద్రం ఇప్పుడు జోన్ అసాధ్యమని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం దారుణమన్నారు.
ఆంధ్రప్రదేశ్, చంద్రబాబును లక్ష్యంగా చేసుకొంటూ మోడీ, అమిత్ షా పన్నిన కుట్రలో గవర్నర్, కేసీఆర్ కూడ భాగస్వామ్యులేనని కేశినేని నాని ఆరోపించారు. నాగపూర్ జనాభా కంటే విజయవాడ జనాభా ఎక్కువన్న నాని... అక్కడ మెట్రో మంజూరుకు లేని ఇబ్బంది విజయవాడకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అఫిడవిట్ అంశంపై పార్లమెంటులో పోరాడుతామని స్పష్టం చేశారు.