సరస్వతీదేవిగా విజయవాడ దుర్గమ్మ... బంగారు వీణతో భక్తులకు దర్శనం
ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు.
ఇంద్రకీలాద్రి: శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ సప్తమి బుధవారంనాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు.
త్రిశక్తి స్వరూపిణి నిజస్వరూపాన్ని సాక్షాత్కారింపజేస్తూ శ్వేత పద్మాన్ని అధిష్టించిన దుర్గామాత తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయముద్రతో సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ రోజున అమ్మవారికి గారెలు, పూర్ణాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
భారీసంఖ్యలో భక్తుల అమ్మవారి దర్శనం కోసం వస్తున్నప్పటికి కరోనా నిబంధనలు పాటిస్తూనే వారికి ఆలయప్రవేశం కల్పిస్తున్నట్లు ఈఓ సురేష్ బాబు వెల్లడించారు. ఆన్ లైన్ టికెట్లు కొన్న భక్తులకే అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుందన్నారు. మూల నక్షత్రం దృష్ట్యా 3000 అదనపు టికెట్లు పెంచామని,.. విఎంసి,పున్నమిఘాట్ వద్ద టైం స్లాట్ చూసి టికెట్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ వెల్లడించారు.