దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలి కారులో మద్యం: సూత్రధారి కొడుకే..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దుర్గ గుడి ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలి కారులో మద్యం దొరికిన కేసుకు సంబంధించి నాగ వెంకట వరలక్ష్మీ కుమారుడినే సూత్రధారిగా తేల్చారు ఎస్ఈబీ పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దుర్గ గుడి ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలి కారులో మద్యం దొరికిన కేసుకు సంబంధించి నాగ వెంకట వరలక్ష్మీ కుమారుడినే సూత్రధారిగా తేల్చారు ఎస్ఈబీ పోలీసులు.
కారులో అక్రమంగా మద్యం తీసుకొచ్చింది ఆమె కొడుకు సూర్యప్రకాశ్ గుప్తానే అని నిర్ధారించారు. అధిక ధరకు అమ్మటానికి మద్యాన్ని సూర్యప్రకాశే తెలంగాణ నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
యూఎస్లో ఇంజనీరింగ్ చేసిన సూర్యప్రకాశ్ను ఈ కేసులో ఏ1గా నమోదు చేశారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సూర్యప్రకాశ్ పనిచేస్తున్నాడు. కాగా ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో దుమారం రేపడంతో దుర్గ గుడి పాలక మండలి సభ్యురాలి పదవికి వరలక్ష్మీ రాజీనామా చేశారు.
Also Read:దుర్గగుడి వివాదం... పాలకమండలి సభ్యురాలి చర్య సరైనదే: ఆలయ ఛైర్మన్
ఇందుకు సంబంధించి ఆలయ ఈవో, పాలక మండలి ఛైర్మన్లకు తన రాజీనామా లేఖను సమర్పించారు. విచారణ పూర్తయ్యే వరకు పదవికి రాజీనామా చేస్తున్నట్లు వరలక్ష్మీ లేఖలో తెలిపారు.
ఈ ఘటనలో ఇప్పటికే నాగ వరలక్ష్మీ భర్త, డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జగ్గయ్యపేటకు చెందిన చెక్కా వెంకట నాగ వరలక్ష్మీ కారులో భారీగా మద్యం వుందని పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు నాగ వరలక్ష్మీ కారులో భారీగా మద్యాన్ని గుర్తించారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.