ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడది ప్రత్యేక స్థానం. కనకదుర్గమ్మ ఉగ్రరూపంలాగే విజయవాడ పాలిటిక్స్ కూడా ఎప్పుడూ హీట్ గానే సాగుతుంటాయి. ఇలా 2024 ఎన్నికల్లో కూడా విజయవాడ హాట్ హాట్ రాజకీయాలు సాగతున్నాయి. విజయవాడలోని మూడుకు మూడు అసెంబ్లీ సీట్లు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేక వ్యూహాలతో కదనరంగంలోకి దిగాయి. ముఖ్యంగా టిడిపి బలంగా వున్న విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని దక్కించుకునేందుకు వైసిపి పొలిటికల్ స్ట్రాటజీ సిద్దం చేస్తే... టిడిపి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దీంతో విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎవరివైపు మొగ్గుతారన్నది ఆసక్తికరంగా మారింది.
విజయవాడ తూర్పు రాజకీయాలు :
విజయవాడ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది వంగవీటి మోహన్ రంగా. విజయవాడ రాజకీయాలను శాసించిన ఈ కాపునేత టిడిపి హవా, ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకుని విజయవాడలో సత్తాచాటారు. 1985 లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన దారుణ హత్య తర్వాత భార్య వంగవీటి రత్నకుమారి (1989,1994) వరుసగా రెండుసార్లు, కుమారుడు వంగవీటి రాధాకృష్ణ (2004) ఓసారి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు.
ఇక విజవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్యేగా పనిచేసారు. కేవలం కాంగ్రెస్, టిడిపిలనే కాదు బిజెపి, ప్రజారాజ్యం వంటి పార్టీలకు కూడా ఈ నియోకవర్గంలో గెలిచిన చరిత్ర వుంది... కానీ వైసిపి జెండామాత్రం ఇప్పటివరకు ఎగరలేదు. గత రెండు అసెంబ్లీ (2004, 2019) ఎన్నికల్లోనూ టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గెలిచారు. ఈసారి మళ్లీ టిడిపి గెలుస్తుందో లేక వైసిపి సత్తా చాటుతుందో చూడాలి.
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. విజయవాడ అర్బన్ మండలం (విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 32, 36 నుండి 41, 45 నుండి 48, 50 నుండి 74 వార్డులు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి)
విజయవాడ అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,75,724
పురుషులు - 1,36,265
మహిళలు - 1,39,438
విజయవాడ తూర్పు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
వైసిపి దేవినేని అవినాష్ ను విజయవాడ తూర్పు బరిలో దింపుతోంది. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన దేవినేని నెహ్రూ తనయుడే ఈ అవినాష్. 2019లో గుడివాడ నుండి టిడిపి తరపున పోటీచేసిన అవినాష్ వైసిపి అభ్యర్థి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు... ఇప్పుడు అదే వైసిపి తరపున విజయవాడలో పోటీకి సిద్దమయ్యారు.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు చేయడంలేదు... గత రెండుసార్లుగా గెలిచివస్తున్న గద్దె రామ్మోహన్ కే మళ్లీ అవకాశం ఇచ్చింది. ఆయన హ్యాట్రిక్ గెలుపుపై టిడిపి ధీమాతో వుంది.
విజయవాడ తూర్పు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
విజయవాడ తూర్పు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓటు - 1,86,923
టిడిపి - గద్దె రామ్మోహన్ - 82,990 (44 శాతం) - 15,164 ఓట్లతేడాతో విజయం
వైసిపి - బొప్ప భావ కుమార్- 67,826 (36 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - బత్తిన రాము - 30,137 (16 శాతం)
విజయవాడ తూర్పు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,85,159 (65 శాతం)
టిడిపి -గద్దె రామ్మోహన్ - 88,784 (47 శాతం) - 15,503 ఓట్ల తేడాతో విజయం
వైసిపి - వంగవీటి రాధాకృష్ణ - 73,281 (39 శాతం) - ఓటమి
