సారాంశం

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై రెండు  రోజుల క్రితం  విజయవాడ కోర్టులో మహిళ వాలంటీర్ చేసిన ఫిర్యాదు మొదటికొచ్చింది. ఈ ఫిర్యాదుపై  విచారణ చేసే అధికారం తమ పరిధిలోకి ఎలా వస్తుందో  చెప్పాలని  కోర్టు ప్రశ్నించింది

విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై  రెండు రోజుల క్రితం  మహిళా వాలంటీర్ దాఖలు  చేసిన పిటిషన్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది.ఈ విషయమై  విచారణ  జరిపే అధికారం తమ పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని కోర్టు ప్రశ్నించింది.  వాలంటీర్ల  ప్రతిష్టను దెబ్బతీసేలా  వ్యాఖ్యలున్నాయని చెప్పేందుకు  ఆధారాలు చూపాలని కూడ కోర్టు సూచించింది.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై   మహిళ వాలంటీర్ విజయవాడ సివిల్ కోర్టులో  ఈ నెల  24వ తేదీన  క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ పై  ఐపీసీ  500, 504,  504 తదితర సెక్షన్ల కింద శిక్షించాలని  మహిళ వాలంటీర్ విజయవాడ కోర్టులో ఫిర్యాదు  చేశారు.
ఈ నెల  9వ తేదీన వారాహి యాత్రలో  పవన్ కళ్యాణ్ వాలంటీర్లనుద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.  మహిళల అక్రమ రవాణాలో  వాలంటీర్లు దోహదపడుతున్నారని వ్యాఖ్యలు  చేశారు. కేంద్ర నిఘా సంస్థలు తనకు  ఈ విషయాన్ని చెప్పినట్టుగా  పవన్ కళ్యాణ్  వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై  మహిళ వాలంటీర్ రెండు  రోజుల క్రితం  విజయవాడ సివిల్ కోర్టులో ఫిర్యాదు  చేశారు. 

also read:పవన్ కళ్యాణ్‌కు షాక్: విజయవాడ సివిల్ కోర్టులో మహిళ వాలంటీర్ ఫిర్యాదు

వాలంటీర్లపై  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై  వైఎస్ఆర్‌సీపీ సర్కార్ తీవ్రంగా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై  పవన్ కళ్యాణ్ పై  కోర్టులో ఫిర్యాదు  చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై  తదుపరి నిర్ణయం తీసుకోవాలని  జగన్ సర్కార్  పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను  ఈ నెల  20వ తేదీన  ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఇదే సమయంలో రెండు  రోజుల క్రితం మహిళ వాలంటీర్  కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు  వ్యాఖ్యల నేపథ్యంలో  ఈ విషయమై  తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే విషయమై  సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాష్ట్రంలోని  ప్రజల వ్యక్తిగత డేటాను  వాలంటీర్లు సేకరిస్తున్నారని  పవన్ కళ్యాణ్ ఆరోపించారు.  విశాఖపట్టణంలో  ప్రజల నుండి డేటా సేకరిస్తున్న వాలంటీర్ వీడియోను  ట్విట్టర్ వేదికగా  పవన్ కళ్యాణ్ గత  వారంలో  షేర్ చేశారు.