పోతిరెడ్డిపాడుపై నిలదీసిన విజయసాయి: చంద్రబాబుకు చిక్కులే....
పోతిరెడ్డిపాడు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై వైఖరి ఏమిటని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు.
అమరావతి: పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేయాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆలోచన చేసినట్లు కనిపిస్తున్నారు.
కృష్ణా నదీ జలాలను శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా తరలించడానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుని 203 జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆ జీవోపై చంద్రబాబు వైఖరిని ప్రశ్నిస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. "చంద్రబాబు గారూ... శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు. దాంతో ఆగకుండా చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
"అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు... ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా?" అని అడిగారు. అంతేకాకుండా "మీరు రాయలసీమ బిడ్డేనా?... మీరు ఎపీవారేనా...?" అని నిలదీశారు.