పవన్ కల్యాణ్ బస్సు యాత్రపై విజయసాయి ఆసక్తికర వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన బస్సు యాత్రపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన బస్సు యాత్రపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ప్రజా సమస్యలపై ఎవరు పోరాడిన సంతోషమేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
అదే విధంగా ప్రజాసమస్యలకు ఎవరు పరిష్కారం చూపినా అభినందించాల్సిందేనని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా ఆయన విశాఖపట్నంలో సంఘీభావ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని ఆయన ్న్నారు. ప్రభుత్వ తీరుకుని నిరసనగా ఈ నెల 16వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ భూకబ్జాలు, ధనార్జనే ధ్యేయంగా ప్రజకంటక సభ్యుడిగా మారారని ఆయన ఆరోపించారు. షిపింగ్ హార్బర్ ను పోర్ట్ ఆధిపత్యం నుంచి స్వాధీనం చేసుకుని మత్స్యకార సంఘాలకు అప్పగిస్తామనే ప్రభుత్వం హామీ నెరవేరలేదని, పైగా విశాఖ కంటైనర్ టెర్మినల్ ను ఆక్రమించకుంటోందని ఆయన విమర్శించారు.