ఇప్పటి వరకు భీమిలి వైసీపీ సమన్వయకర్తగా పనిచేసిన విజయనిర్మల వర్గీయలు అవంతి నియామకంపై రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసేందుకు విజయనిర్మల ఎంతో  కృషి చేశారని ఎన్నికలకు మూడు నెలల ముందు అవంతికి బాధ్యతలు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొంది. వైసీపీలోకి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ రాకపై భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త విజయనిర్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. అవంతి శ్రీనివాస్ వస్తే తన సీటుకు ఎసరువస్తోందని ఆమె భయం. ఆమె అనుకున్నట్లుగానే జరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఆయనను భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా మంగళవారం ప్రకటించారు పార్టీ అధినేత వైఎస్ జగన్. అవంతిని భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ గా నియమించడంపై అసంతృప్తి జ్వాల చెలరేగింది. 

ఇప్పటి వరకు భీమిలి వైసీపీ సమన్వయకర్తగా పనిచేసిన విజయనిర్మల వర్గీయలు అవంతి నియామకంపై రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసేందుకు విజయనిర్మల ఎంతో కృషి చేశారని ఎన్నికలకు మూడు నెలల ముందు అవంతికి బాధ్యతలు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మంత్రి గంటా శ్రీనివాసరావును ధీటుగా ఎదుర్కొంటూ ఆమె నియోజకవర్గంలో వైసీపీని ఎంతో బలోపేతం చేశారని చెప్తున్నారు. మరోవైపు అవంతి శ్రీనివాస్ ను భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడంపై ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. 

అవంతి శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీని వీడారన్నది బహిరంగ రహస్యం. తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గం టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పడంతో ఆయన వైసీపీలో చేరారని ప్రచారం జరుగుతుంది. 

ఎందుకంటే గతంలో అవంతి శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన అవంతి ప్రజారాజ్యం పార్టీ తరుపున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

2014 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అయితే అసెంబ్లీకి పోటీ చెయ్యాలన్నది ఆయన ఉద్దేశం. అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని అవంతి శ్రీనివాస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.