‘కోట్లాది ప్రజల గుండె చప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి’..విజయమ్మ తాజాగా చేసిన వ్యాఖ్యలివి.

‘కోట్లాది ప్రజల గుండె చప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి’..విజయమ్మ తాజాగా చేసిన వ్యాఖ్యలివి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభిస్తున్న జన సంకల్పయాత్ర సందర్భంగా వైసీపీ గౌరవాధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి విజయమ్మ ఆదివారం ఓ చానల్ తో మాట్లాడారు. వైఎస్ పాదయాత్ర గురించి ప్రస్తావిస్తూ ప్రజల కష్టాలను దగ్గర నుండి చూసేందుకే ఆరోజు వైఎస్ఆర్ పాదయాత్ర చేసినట్లు తెలిపారు. పాదయాత్ర చేయటం వల్లే పేదలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్య శ్రీ, 2 రూపాయలకు కిలో బియ్యం, పావలా వడ్డీకే రుణాలు, వృద్ధాప్య పింఛన్లు, అభయహస్తం, ఫీజు రీ ఎంబర్స్ మెంట్, 104, 108 లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి జన హ్రుదయాల్లో వైఎస్ చిరస్ధాయిగా నిలిచిపోయినట్లు విజయమ్మ గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వం వైఎస్ పథకాలకు తూట్లు పొడుస్తున్నట్లు ధ్వజమెత్తారు.

తండ్రికి తగ్గ కూతురుగా, జగనన్న వదిలిన బాణంగా షర్మిల కూడా పాదయాత్ర చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇపుడు జగన్ చేయబోయే పాదయాత్ర కూడా చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. వైఎస్-చంద్రబాబునాయుడు ప్రభుత్వంలోని తేడాను ప్రజలు అందరూ గుర్తించారని కూడా తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక చర్యలపై ప్రజల్లో అవగాహన, చైతన్యం తేవటానికే జగన్ పాదయాత్రను మొదలుపెడుతున్నట్లు విజయమ్మ స్పష్టం చేసారు.