గన్నవరం విమానాశ్రయంలో బాబుకు తనిఖీలు: ఘాటుగా స్పందించిన విజయసాయి
గన్నవరం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తనిఖీ చేయడంపై వచ్చిన వ్యాఖ్యలకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పందించారు.
అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తనిఖీ చేయడంపై వచ్చిన వ్యాఖ్యలకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పందించారు. మీడియాలో వచ్చిన వ్యాఖ్యానాలపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
"ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. ఆయన కాన్వాయ్కి ట్రాఫిక్ను ఆపడం లేదట. ఎయిర్పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట" అని ఆయన అన్నారు.
"ఒక బీసీ నాయకుడు స్పీకర్ అయితే గౌరవించాల్సిన అవసరం లేదనే మీ ఫిలాసఫీ అందరికీ తెల్సిందే చంద్రబాబూ గారూ. కిందటిసారి మీ కులపెద్ద సభాపతి అయితే తోడ్కొని వెళ్లారు. అప్పుడు మీరు పిలవకున్నా హుందాగా జగన్ గారు మీతో పాటు నడిచి ఆయనను అభినందించారు. మీకూ ఆయనకు తేడా అదే!" అని ఆయన విరుచుకుపడ్డారు.