పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడి నివాసం ముందు వారు ఆందోళనకు దిగారు.

నిడదవోలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మానియా కొనసాగుతోంది. కరోనా కారణం చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్డ్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో పవన్ కల్యాణ్ అభిమానులు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పవన్ కల్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్లు కొన్నారు. అయితే, థియేటర్ లో బెనిఫిట్ షో వేయకపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. దాంతో ఆందోళనకు దిగారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ షోలకు షాక్ తగిలింది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన సాధారణ షోలు ఆగిపోయాయి. సినిమా ప్రదర్శనలను ఆపేయాలని థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు అందాయి. దీంతో వకీల్ సాబ్ ప్రదర్శనలు ఆగిపోయాయి.

దాంతో పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. థియేటర్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో థియేటర్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. దీంతో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తిరుపతి లోకసభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తున్నాయి. 

ఇదిలావుంటే, కడప జిల్లా బద్వేలులో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. థియేటర్ లోని కుర్చీలను విరగ్గొట్టారు. పవన్ కల్యాణ్ అబిమానులకు, ధియేటర్ యజమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారంనాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. పింక్ హిందీ సినిమా ఆధారంగా ఈ సినిమా తీశారు. పలు చోట్ల ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.