ఎన్డీయేలో చేరండి..బాబు చేసిన తప్పు చేయకండి: జగన్కు కేంద్రమంత్రి ఆఫర్
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన మెజారిటీ సాధించిన టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఎన్డీఏలో చేరాల్సిందిగా పలువురు బీజేపీ నేతలు కోరుతున్నారు
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన మెజారిటీ సాధించిన టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఎన్డీఏలో చేరాల్సిందిగా పలువురు బీజేపీ నేతలు కోరుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే సైతం ఇదే రకమైన విజ్ఞప్తి చేశారు.
ఆదివారం హైదరాబాద్ వచ్చిన మీడియాతో మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాలు మరింత ముందుకు సాగాలంటే కేంద్రం సహకారం అవసరమని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు కేంద్ర ప్రభుత్వ అందదండలు తీసుకోవాలన్నారు.
తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ప్రధాని మోడీ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తారని అథవాలే తెలిపారు. మోడీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు అండగా నిలిచిందని.. ముస్లింలు, ఇతర మైనార్టీలకు మోడీ వ్యతిరేకమనే ప్రచారంలో నిజం లేదని అథవాలే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో అద్భుత విజయం సాధించిన వైఎస్ జగన్కు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చంద్రబాబు చేసిన తప్పును జగన్ చేయొద్దని రామ్దాస్ సూచించారు. మోడీని తీవ్రంగా విభేదించి, ఎన్డీయే నుంచి బాబు తప్పుకున్నారని.. కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఆయన ఓడిపోయారని రామ్దాస్ గుర్తు చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వడం అనేక సంక్లిష్టతలతో కూడిన వ్యవహారమని.. అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.