కాంగ్రెస్ ఉచ్చులో చంద్రబాబు, బయటకు రాలేడు: రాజ్నాథ్ సింగ్
కేంద్రంలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉన్నా.... మిత్ర ధర్మాన్ని తాము ఏనాడూ కూడ విస్మరించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలను గౌరవిస్తామన్నారు
గుంటూరు: చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఉచ్చులో పడ్డాడని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకున్న వారంతా తిరిగి బయటపడలేరన్నారు. మోడీ తిరిగి ప్రధాని కాకుండా ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. వెంటిలేటర్పై ఉన్న కాంగ్రెస్తో నాలుగు ఓట్లు సంపాదించాలని చంద్రబాబునాయుడు ఆశ పడుతున్నాడని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
గుంటూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు.
కేంద్రంలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉన్నా.... మిత్ర ధర్మాన్ని తాము ఏనాడూ కూడ విస్మరించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలను గౌరవిస్తామన్నారు. తెలుగు వాడైనా పీవీ నర్సింహరావు దేశానికి ప్రధానిగా పనిచేసినా.. కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానపర్చిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు. భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్రంలో కూడ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం 4 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు... రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండాలని తాను కోరుకొంటున్నట్టుగా రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
బీజేపీకి ఉన్న కార్యకర్తలు దేశంలోని ఏ రాజకీయ పార్టీకి ఉండబోరని ఆయన చెప్పారు. దేశంలోని మూడింట రెండొంతుల రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకొందన్నారు.
2014లో కేంద్రంలో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రేసేతర పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రావడం ఇదే తొలిసారని... అది బీజేపీకే సాధ్యమైందన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలోని పార్టీల మిత్ర ధర్మాన్ని పాటించేందుకు ప్రయత్నించిందన్నారు. మిత్ర ధర్మాన్ని పాటించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించినట్టు చెప్పారు. నాడు వాజ్పేయ్ ప్రభుత్వం... నేడు మోడీ ప్రభుత్వం కూడ మిత్ర ధర్మాన్ని పాటించిందన్నారు.
దేశంలో పీవీ నరసింహరావు మాత్రమే దేశంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపాడన్నారు. నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు సంకీర్ణ ప్రభుత్వాలను నడపలేదన్నారు.
దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను మొదలు పెట్టాడన్నారు. పీవీ చనిపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పీవీ పార్థీవ దేహన్ని తీసుకెళ్లలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలెవరూ కూడ మర్చిపోలేరన్నారు.నెహ్రు కుటుంబానికి చెందిన వారిని కాంగ్రెస్ పార్టీ గౌరవించిందన్నారు. కానీ, బీజేపీ మాత్రం పార్టీ కోసం పనిచేసినవారిని గుర్తు పెట్టుకొందన్నారు.