విశాఖ రైల్వేజోన్పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
విశాఖ రైల్వే జోన్ ప్రారంభానికి కాలపరిమితి లేదన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రస్తుతం డీపీఆర్ రైల్వే శాఖ పరిశీలనలో ఉందని ఆయన పేర్కొన్నారు. కొత్త జోన్లో వాల్తేరు డివిజన్ను చేర్చాలని ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి విజ్ఞప్తులు అందాయని కేంద్ర మంత్రి తెలిపారు
విశాఖ రైల్వే జోన్ ప్రారంభానికి కాలపరిమితి లేదన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విశాఖ జోన్ ఏర్పాటుకు నియమించిన ప్రత్యేక అధికారి డీపీఆర్ ఇచ్చారని అశ్విని తెలిపారు. ప్రస్తుతం డీపీఆర్ రైల్వే శాఖ పరిశీలనలో ఉందని ఆయన పేర్కొన్నారు. కొత్త జోన్ కార్యకలాపాలు ఎప్పట్నుంచి ప్రారంభించాలో కాలపరిమితి లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కొత్త జోన్లో వాల్తేరు డివిజన్ను కలపడంపై అన్నీ పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కొత్త జోన్లో వాల్తేరు డివిజన్ను చేర్చాలని ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి విజ్ఞప్తులు అందాయని కేంద్ర మంత్రి తెలిపారు. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకునే జోన్ పరిధి నిర్ణయిస్తామని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.