ఏపీకి అదనంగా కోటి డోసుల కరోనా వ్యాక్సిన్ సరఫరాకు కేంద్రం ఓకే
రాష్ట్రానికి అదనంగా కోటి డోసుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
అమరావతి: రాష్ట్రానికి అదనంగా కోటి డోసుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. నిర్దిష్ట అర్హతలున్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించినందున కోటి డోసులు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మార్చి 26న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్కు లేఖ రాశారు.
పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు పూర్తయి ప్రజా ప్రతినిధులు బాధ్యతలు చేపట్టారని, సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే 25 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు వివరించారు. తగినంత అందుబాటులో ఉంటే వ్యాక్సినేషన్ను ఉధృతంగా చేపడతామన్నారు.
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పందిస్తూ ఇప్పటివరకూ ఏపీకి 36.37 లక్షల డోసులిచ్చామని, వీలైనంత త్వరలో రాష్ట్రానికి అదనంగా వ్యాక్సిన్ పంపించే ఏర్పాట్లు చేస్తామని ఏపీ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాశారు.