సినిమాల్లో మళ్లీ నటించాలని తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తాను ఎప్పుడో సూచించానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. రాజధాని తరలింపుపై తాను ఏమీ చెప్పలేకపోతున్నట్లు ఆయన తెలిపారు.

రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తే మంచిదని తాను ఎప్పుడో చెప్పినట్లు మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాణం కూడా జరుగుతోంది. పింక్ రీమేక్ లో ఆయన నటిస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మూడు రాజధానుల విషయంలో తాను ఏమీ చెప్పలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఒకచోట, సెక్రటేరియేట్ ఒకచోట దేశంలో ఎక్కడా లేవని అన్నారు. రాజధాని అంశం కంటే పోలవరం, ప్రత్యేకహోదాకు జగన్ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

ప్రభుత్వం చెబుతున్నట్లు 2021 జూన్ కి పోలవరం పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని ఉండవల్లి అన్నారు. అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని, రియల్ ఎస్టేట్ లో భాగస్వామ్యమని ఎప్పుడో చెప్పానని ఆయన అన్నారు. గ్రామ సచివాలయాలు చాలా మంచి కాన్సెప్ట్ అని, జగన్ ప్రభుత్వం పెన్షన్లు తీసివేస్తున్న విధానం సరికాదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని, అమరావతిని సచివాలయ రాజధానిని, కర్నూలును న్యాయరాజధానిని చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు అర్థమవుతోంది.