చింతమనేని సహాయం కోసం వెళ్లిన అక్కాచెల్లెళ్ల అదృశ్యం
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహాయం కోసం వెళ్లిన అక్కా చెల్లెళ్లు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వారం రోజులైనా వీరిద్దరి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు.
ఏలూరు: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహాయం కోసం వెళ్లిన అక్కా చెల్లెళ్లు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వారం రోజులైనా వీరిద్దరి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు.
విజయవాడ గుణదల గంగిరెద్దుల దిబ్బకొండ ప్రాంతానికి చెందిన కోట జ్యోతి కొన్ని మాసాలుగా స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో తన ఇద్దరి పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఆమెకు భర్త రాముతో వివాదాలు ఉన్నాయి. దీంతో పదేళ్లుగా అతడికి ఆమె దూరంగా ఉంటుంది.
పెద్ద కూతురు ఓ ప్రైవేట్ కాలేజీలో డిప్లొమో మూడో సంవత్సరం చదువుతోంది. రెండో కూతురు గూడవల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. జ్యోతి కూలీ పనులు చేస్తూ పిల్లలను చదవిస్తోంది. అయితే ఇటీవల ఆమె అనారోగ్యానికి గురైంది.
కిడ్నీలు పాడై జ్యోతి అనారోగ్యానికి గురైంది. జ్యోతిని కాపాడుకొనేందుకు పిల్లలిద్దరూ కూడ కూలీ పనులు చేస్తున్నారు. జ్యోతి స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లాలోని నడిపల్లి. దీంతో తమకు సహాయం చేయాలని కోరేందుకు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కలవాలని భావించి వీరిద్దరూ ఈ నెల 4వ తేదీన ఉదయం పది గంటలకు వెళ్లారు. కానీ, ఇంతవరకు వారిద్దరి ఆచూకీ లభించలేదు.
ఈ నెల 10వ తేదీన మాచవరం పోలీసులకు జ్యోతి ఫిర్యాదు చేసింది. గత ఏడాది ఈ కుటుంబం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఉండేది. తమ పరిస్థితిని చెప్పుకొనేందుకు ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావును కలిశారు. ఆ సమయంలో జ్యోతి చిన్న కూతురుపై బొండా ఉమా మహేశ్వరరావు అనుచరులు అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు యువకులు బెయిల్పై విడుదలయ్యారు. ఈ నలుగురు యువకులు కక్ష సాధింపుకు పాల్పడ్డారనే జ్యోతి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.