అనంతపురం జిల్లాలో వినాయక నిమజ్జనంలో విషాదం.. నీటిలో పడి ఒకరు మృతి, బాలిక గల్లంతు
వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ఒకరు మృతి చెందగా.. ఓ బాలిక గల్లంతైంది.
వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ఒకరు మృతి చెందగా.. ఓ బాలిక గల్లంతైంది. బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలోని రాప్తాడు సమీపంలోని పండమేరు వంకలో చోటుచేసుకుంది. వివరాలు.. అనంతపురం సాయినగర్కు చెందిన కొందరు గణేష్ విగ్ర హ నిమజ్జనం కోసం పండమేరు కాలువకు వెళ్లారు . నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నలుగురు నీటిలో పడిపోయారు.
నీటిలో పడిపోయిన నలుగురిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. శ్రీరాములు (45), జయశ్రీ అనే బాలిక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే గాలింపు చర్యలు చేపట్టగా.. శ్రీరాములు మృతదేహం లభ్యమైంది. గల్లైంతన బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయినగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.