బాపట్ల జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. కృష్ణా నదిలో పడి ఇద్దరు దుర్మరణం..
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్బంగా అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున కృష్ణా నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేస్తుండగా నదిలో పడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్బంగా అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున కృష్ణా నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేస్తుండగా నదిలో పడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతులను రేపల్లె వాసులు విజయ్ (22), వెంకటేష్ (25)గా గుర్తించారు. వివరాలు.. రేపల్లె పట్టణంలోని నేతాజీ నగర్ వాసులు వినాయక చవితి సందర్భంగా గణేషుని విగ్రహం ఏర్పాటు చేశారు. మూడో బుధవారం రాత్రి విగ్రహ నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా ఉరేగింపుతో రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో కృష్ణ నది ఒడ్డుకు చేరుకున్నారు.
అయితే నదిలో గణేష్ విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు విజయ్, వెంకటేష్లు నదిలో పడి గల్లంతయ్యారు. ఇది గమనించిన తోటివారు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వారు నదిలో మునిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు నదిలో గల్లంతైన విజయ్, వెంకటేష్ మృతదేహాలను వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం రేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.