ఓ తాగుబోతును కాపాడబోయి ఇద్దరు సామాన్యులు బలయిన ఘటన  కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే మందుబాబు మాత్రం మద్యం మత్తులోనూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. 

విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఓ తాగుబోతు నిర్వాకానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. తాగినమైకంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిపై మానవత్వం చూపించి కాపాడేందుకు ప్రయత్నించి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా తాగుబోతు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం ముత్యాలంపాడులో పచ్చిగోళ్ల ప్రవీణ్ పెద్ద తాగుబోతు. నిత్యం మద్యం సేవించి వచ్చి నానా హంగామా సృష్టించేవాడు. ఇలాగే బుధవారం రాత్రి కూడా ఫుల్లుగా మద్యం సేవించిన అతడు ఆ మత్తులో చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. 

వీడియో

అయితే అతడు చెరువులో దూకడాన్ని గమనించిన చిలపరపు నాని(19), పచ్చిగోళ్ల చిన్న కోటేశ్వరరావు(34) కాపాడేందుకు చెరువులో దిగారు. అయితే ప్రవాహ ఉధృతికి ఇద్దరూ కొట్టుకుపోయారు. కానీ ప్రవీణ్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు చెరువులో గాలింపు చేపట్టారు. దీంతో ఇద్దరిలో యువకుడు నాని మృతదేహం లభించింది. కోటేశ్వరరావు కోసం గాలింపు కొనసాగుతోంది. మానవత్వంతో ఓ మనిషిని కాపాడబోయి ఇలా ఇద్దరు బలయ్యారు.