సిఫారసు లేఖలపై వివాదం.. తెలంగాణ ప్రజాప్రతినిధుల వాదన అవాస్తవం: టీటీడీ
శ్రీవారి దర్శనానికి సంబంధించి సిఫారసు లేఖలు అంగీకరించడం లేదన్న తెలంగాణ ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలపై టీటీడీ ఘాటుగా బదులిచ్చింది. వారికి గతంలో అమలవుతున్న విధానాన్ని తాము కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.
తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు చేసుకుంటోన్న విజ్ఞప్తులను తాము తిరస్కరించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. తాము సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. గతంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఎలాంటి నిబంధనలు అమలు జరిగేవో ఇప్పుడు కూడా వాటినే కొనసాగిస్తున్నామని తెలిపింది. కొన్ని రోజుల క్రితం తెలంగాణకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు వారి కోటాకు మించి సిఫారసు లేఖలు ఇచ్చారని పేర్కొంది.
అయితే, వీఐపీ బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండడంతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు అధికంగా రావడంతో కోటాకు మించి వచ్చిన లేఖలను మాత్రమే తిరస్కరించామని వెల్లడించింది. చివరకు, తమకు కొందరు ఫోన్ చేసి విజ్ఞప్తులు చేసుకోవడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మంజూరు చేసి శ్రీవారి దర్శనం చేయించామని టీటీడీ అధికారులు తెలిపారు. గదులకు సంబంధించి కూడా వారికి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించింది.