త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. నిన్న బొత్స, తాజాగా వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందన్నారు వైసీపీ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి . నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిపై వైసీపీ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిక్యూటివ్ రాజధాని కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని, త్వరలో అది సాకారం అవుతుందన్నారు. మధ్య తరగతికి అనువైన నిర్మాణాలు జరిగేలా బిల్డర్లు చొరవ చూపాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. టీడీఆర్, రేరా అమలుకు సంబంధించిన ఇబ్బందులను పరిష్కరిస్తామని... ఖాళీ స్థలాల ట్యాక్స్పై ఇండస్ట్రీ అభ్యర్ధనను అధికారులతో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఇకపోతే... నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది చంద్రబాబేనన్నారు. ఉత్తరాంధ్రను దోచుకోవడానికి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వచ్చారంటున్న చంద్రబాబు.. వారేం చేశారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. తమ శాఖలపై వారు స్వారీ చేయడానికి తామేమైనా చిన్న పిల్లలమా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు రాజులకు పదవులు అప్పగించారని.. అప్పట్లో వైసీపీ నుంచి కొందరినీ టీడీపీలోకి చేర్చుకోలేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అమరావతి పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని మట్టి పాలు చేశారని బొత్స మండిపడ్డారు. త్వరలోనే విశాఖకు రాజధాని తరలివస్తుందని ఆయన జోస్యం చెప్పారు. బీసీలకు ఎన్టీఆర్ చేసినదానిని చంద్రబాబు చెప్పుకోవడం ఏంటని మంత్రి మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నట్లు నిజాలు మాట్లాడకూడదని చంద్రబాబుకు శాపం వున్నట్లుగా వుందని బొత్స చురకలంటించారు.
Also REad: మేం చిన్నపిల్లలమా, వాళ్లిద్దరూ మాపై స్వారీ చేయడానికి.. చంద్రబాబుకు బొత్స కౌంటర్
అంతకుముందు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు మాదిరిగా తనకు వేరే రాష్ట్రం, వేరే పార్టీ లేదన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని కూడా తాను అనడం లేదని సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడే నివాసం ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా నది నీళ్లను కడప జిల్లాకు తీసుకు వచ్చారన్నారు. అంతకు ముందు ఎంతమంది సీఎంలున్నా కూడా జిల్లాకు కృష్ణా నది నీళ్లు తేలేదన్నారు.