ఓవైపు కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోకుండా నూతన సంవత్సర వేడుకల ద్వారా భారీ ఆదాయాన్ని పొందేందుకు ఇరు తెలుగు రాష్ట్రాలు సిద్దమయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలను అనుమతిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

అమరావతి: ఓవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్నా భారీ ఆదాయమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం న్యూఇయర్ (new year celebrations) సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ బాటలో నడుస్తూ ఇవాళ(డిసెంబర్ 31) అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను జరిపేందుకు జగన్ సర్కార్ సిద్దమయ్యింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని వైన్స్ (wines), బార్ల (bars)లో రాత్రి సమయంలో ప్రతిరోజు కంటే ఎక్కువసమయం మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఇవాళ (శుక్రవారం) ఉదయం 10గంటల నుంచి రాత్రి 12గంటల వరకూ రాష్ట్రంలోని బార్లు తెరిచివుంచేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. అలాగే మద్యం దుకాణాలు (wine shops) కూడా ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకూ తెరిచివుంచేందుకు అనుమతిచ్చారు. 

అయితే ఈ సమయాన్ని మరో గంట పెంచుతూ తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేసారు. రాష్ట్రంలోని బార్లు, రీటైల్ మద్యం దుకాణాలు, ఇన్ హౌస్ లో మద్యం విక్రయాల సమయాన్ని ఇప్పటికే ప్రకటించిన సమయానికి మరో గంటపాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే బార్లకు ఇవాళ అర్ధరాత్రి 1గంట వరకు, వైన్స్ లకు రాత్రి 11గంటల వరకు మద్యాన్ని విక్రయించేందుకు అనుమతించారు.

read more మందుబాబులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గం.ల వరకు మద్యం షాపులకు అనుమతి..

ఇక ఇప్పటికే అనుమతి పొందిన ఈవెంట్స్ తో పాటు పర్యాటక లైసెన్సులు కలిగిన హోటళ్ల లో కూడా మద్యం విక్రయానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు, బార్లకు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించేందుకు అనుమతిచ్చంది. లైసెన్స్ హోల్డర్లు అర్ధరాత్రి వరకు తమ వ్యాపారాన్ని నిర్వహించవచ్చని తెలంగాణ ఎక్సైజ్ శాఖ (Excise Department) అనుమతులిస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా జారీచేసింది. వైన్ షాపుల్లో రాత్రి 12గంటల వరకు...బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఈవెంట్‌లు ఉదయం 1 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించారు.

read more Omicron in AP: ప్రకాశం జిల్లాలో మహిళకు ఒమిక్రాన్, 17కు చేరిన కేసులు

ఇదిలావుంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులతో పాటు న్యూ వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తెలంగాణలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 67కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Omicron కేసుల సంఖ్య 17కు చేరుకుంది. 

ఇలా ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్న సమయంలో ఆంక్షలు విధించిన ప్రభుత్వమే మద్యం విక్రయాలకు అర్ధరాత్రి వరకు అనమతించడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వాలకు ఆదాయమే ఎక్కువయ్యిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రభుత్వాల నిర్ణయంలో ఒమిక్రాన్ వ్యాప్తి మరింత జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతించడానికి ప్రభుత్వం అనుమతివ్వడాన్ని తప్పుబడుతున్నాయి.