మంగళ, బుధ వారాల్లో ఏపీలో భారీ వర్షాలు... విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక
ఆంధ్ర ప్రదేశ్ లో మరీ ముఖ్యంగా కోసాంద్ర ప్రాంతంలో ఇవాళ,రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నందున ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వుండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
విశాఖపట్నం: కొద్దిరోజులుగా ముఖం చాటేసిన వర్షాలు తెలుగురాష్ట్రాల్లో మళ్లీ మొదలయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల ఇవాళ(మంగళవారం), రేపు(బుధవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని... ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు.
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి పయనిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయి. అక్కడక్కడ ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించారు.
అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వేగంతో గాలులు వీస్తాయని... సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపారు. ఈ రెండు రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
read more విచిత్రం : వర్షాలు కురవాలని.. మద్యం,మాంసం నైవేద్యం..గుళ్లోనే తాగి,తినే సంప్రదాయం...
ఇక తెలంగాణలోనూ వర్షాలు మొదలయ్యాయి. ఈ వర్షాలు ఇవాళ, రేపు (మంగళ,బుధవారాల్లో) కూడా కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న తెలిపారు. దీంతో ఉష్షోగ్రతలు కూడా తగ్గుతాయని తెలిపారు. హైదరాబాద్ తో రాష్ట్రవ్యాప్తంగా ఉక్కపోత కూడా తగ్గనుందని వాతావరణ కేంద్ర సంచాలకులు వెల్లడించారు.
వర్షాకాలం ఆరంభంలో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తీరా పంటకు నీరు అవసరమైన సమయంలో వర్షాలు కురవలేదు. ఇది చాలదన్నట్లు ఉష్ణోగ్రతలు వేసవిని తలపించాయ. దీంతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పలు గ్రామాల్లో వర్షాల కోసం పూజలు చేశారు. వారి పూజల ఫలితమో ఏమో తెలియదు కానీ రాష్ట్రంలో తిరిగి వర్షాలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలో వర్షాలు లేకున్నా ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్ఫ్లో 5,04,086 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50 అడుగులకు వరద చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. జలాశయంలో 207.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి జలాశయానికి వరద వస్తుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.