తిరుమల భద్రత కోసం 14 మార్గాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు, అన్ని బృందాలకు శిక్షణ అందించేందుకు భద్రతా కార్యాచరణ సిద్ధం

తిరుమలలో భద్రతను మరింత కఠినంగా ఏర్పాటు చేయడానికి సంబంధించి అధికారులంతా కీలక సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతపురం రేంజికి చెందిన డీఐజీ షేముషీ భాజ్‌పేయీ అధ్యక్షతన ఈ సమావేశం తిరుపతిలోని అన్నమయ్య భవనంలో గురువారం జరిగింది. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకొని, తిరుమల భద్రతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నేపథ్యంలో గతంలో, 2023 మేలో నిర్వహించిన భద్రతా ఆడిట్‌లో వచ్చిన సూచనలు, అటు అమలు చేయాల్సిన మార్పులు, తితిదే భద్రతా విభాగం ఇన్‌ఛార్జి సీవీఎస్‌వో హర్షవర్ధన్ రాజు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అన్ని భద్రతా బృందాల మధ్య సమన్వయం పెంచేందుకు ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేయాలని డీఐజీ సూచించారు.

తిరుమలకు వచ్చే మార్గాల్లో ముఖ్యంగా శేషాచల అటవీ ప్రాంతం ద్వారా ప్రవేశించే 14 మార్గాలపై నిఘా పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో తలకోన, మామండూరు, తుంబురు తీర్థం, మంగళం మార్గాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ మార్గాలపై భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని సూచనలు వచ్చాయి.

ప్రైవేట్ భద్రతా సిబ్బందితో పాటు పోలీసు, కేంద్ర భద్రతా బలగాలకు అవసరమైన శిక్షణను ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో గ్రేహౌండ్స్ ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, ఐఎస్‌డబ్ల్యూలోని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వంటి ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

సర్వసాధారణంగా తిరుమల భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పటికీ, మార్తంతమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారుల అభిప్రాయం. భవిష్యత్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ సమీక్షను నిర్వహించారు.