తిరుమల వేంకటేశ్వర స్వామి ఆస్తులు ఎన్ని రూ. కోట్లో తెలుసా?
ప్రముఖ వ్యాపార సంస్థలకు మించి ఆదాయం స్వామివారు పొందడం గమనార్హం. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారి ఆస్తుల వివరాలు వెల్లడించింది.
కలియుగ దైవం, తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆదాయం పెరిగింది. ఆయన ఆస్తుల విలువ రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం తిరుమల వేంకటేశ్వర స్వామి ఆస్తుల విలువ రూ.2.5లక్షల కోట్లుకు పైగా చేరుకుందని తెలుస్తోంది. ప్రముఖ వ్యాపార సంస్థలకు మించి ఆదాయం స్వామివారు పొందడం గమనార్హం. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారి ఆస్తుల వివరాలు వెల్లడించింది.
1933లో టీటీడీ( తిరుమల తిరుపతి దేవస్థానం) ఏర్పడగా.. ఇలా ఆస్తుల వివరాలు వెల్లడించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో ఎప్పుడూ ఇలా ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. భక్తుల సమర్పించిన కానుకలతో కలిసి స్వామి వారి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
స్వామి వారి ఆస్తుల్లో 10.25 టన్నుల బంగారం, రెండున్నర టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అంతేకాకుండా... వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.16వేల కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. వీటికి తోడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూములు, భవనాల రూపంలో దాతలు ఇచ్చిన 960 ఆస్తులు ఉండటం విశేషం. ప్రస్తుత మార్కెట్ ప్రకారం... ఈ ఆస్తుల విలువ రూ.2.5లక్షల కోట్లకు పైగా ఉండటం గమనార్హం.