Asianet News TeluguAsianet News Telugu

గోదావరి నదిలో కొట్టుకుపోయి... ముగ్గురు యువకులు మృతి

 గోదావరి నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయిన విషాద సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

 

 

three young boys drown in Godavari river at kovvuru
Author
Kovvuru, First Published Apr 12, 2021, 2:04 PM IST

కొవ్వూరు: సరదాగా ఈత కొట్టడానికి గోదావరి నదిలో దిగిన ముగ్గురు యువకులు ప్రవాహవేగానికి నీటిలో కొట్టుకుపోయిన విషాద సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా గోదావరి నదిలో గల్లంతయిన వారిలో ఇప్పటివరకు ఓ యువకుడి మృతదేహం లభించగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన ఆరుగురు యువకులు ఆదివారం సినిమా చూడటానికి కొవ్వూరు వెళ్లారు. సాయంత్రం సినిమా ముగిసిన తర్వాత స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. అయితే మధ్యలో సరదాగా గోదావరి నదిలో ఈతకొడదామని ముగ్గురు యువకులు నదిలోకి దిగారు. మిగతా ముగ్గురు తినడానికి ఏమయినా తీసుకువస్తామని చెప్పి గ్రామంలోకి వెళ్లారు. 

ఈ క్రమంలో నదిలో నీటిప్రవాహం ఎక్కువగా వుండటంతో ఈతకు దిగిన ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుల మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు సత్యనారాయణ అనే యువకుడి మృతదేహం గోష్పాద క్షేత్రం వద్ద లభ్యమైంది. మిగతా ఇద్దరు యువకులు హేమంత్‌, సోమరాజు మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరి కోసం జరుగుతున్న గాలింపు ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios