వారాహి యాత్రకు లాంగ్ బ్రేక్... ఫ్యామిలీతో కలిసి ఇటలీకి పవన్
పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఇక ఈ నెలలో కొనసాగే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ మూడు వారాలు ఆయన రాజకీయ, వ్యక్తిగత కారణాలతో బిజీబిజీగా వుండనున్నారు.

అమరావతి : ఇటీవలే పవన్ కల్యాణ్ ప్రారంభించిన నాలుగో విడత వారాహి యాత్రకు లాంగ్ బ్రేక్ పడింది. ఈ నెల ఆరంభంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర చేపట్టారు. ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులతో వరుస సమావేశాలు, టిడిపి-జనసేన పొత్తుపై సమాలోచనలతో ఆయన బిజీబిజీగా వున్నారు. అయితే రాజకీయ, వ్యక్తిగత కారణాలతో ఈ నెలంతా పవన్ బిజీబిజీగా వుండనున్నారు... దీంతో వారాహి యాత్రకు మూడు వారాల బ్రేక్ పడింది.
ఇప్పటికే జనసేను మరింత బలోపేతం చేసేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించేందుకు పార్టీ నాయకులతో పవన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే టిడిపితో కలిసి ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో ఇరుపార్టీల సమన్వయానికి కమిటీ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. ఇలా పవన్ ఈ నెల 17 వరకు రాజకీయంగా బిజీబిజీగా వుండనున్నారు.
సెప్టెంబర్ 9 నుండి 12 వరకు జనసేన పార్టీ ముఖ్య నాయకులతో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక 12 నుండి 17 వరకు పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇలా ఈ వారమంతా పవన్ పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోనున్నారు.
Read More టిడిపికి యనమల, జనసేనకు నాదెండ్ల లీడ్... గెలుపే టార్గెట్ గా ఇరుపార్టీల కీలక నిర్ణయం
ఇక పవన్ సోదరుడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి లు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి పెళ్లి ఈ నెలలోనే ఇటలీలో జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇటలీకి ప్రయాణం కానున్నారు. ఇలా కుటుంబంతో కలిసే ఈ నెలాఖరు వరకు పవన్ పెళ్లివేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం.
అక్టోబర్ 17న పవన్ కుటుంబసమేతంగా ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేడుక ముగిసిన తర్వాత తిరిగి స్వదేశానికి రానున్నారు. ఇటలీ నుండి పవన్ తిరిగివచ్చేది ఈ నెల 26 తర్వాతేనని తెలుస్తోంది.
ఇలా రాజకీయ, వ్యక్తిగత కారణాలతో పవన్ వారాహి యాత్ర ఈ నెలలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వచ్చేనెలలో వారాహి యాత్రతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా పవన్ ప్రజల్లోకి వెళ్లేలా జనసేన ప్లాన్ చేస్తోంది.