- Home
- Andhra Pradesh
- టిడిపికి యనమల, జనసేనకు నాదెండ్ల లీడ్... గెలుపే టార్గెట్ గా ఇరుపార్టీల కీలక నిర్ణయం
టిడిపికి యనమల, జనసేనకు నాదెండ్ల లీడ్... గెలుపే టార్గెట్ గా ఇరుపార్టీల కీలక నిర్ణయం
ఇకపై జగన్ సర్కార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై కలిసి పోరాడేందుకు టిడిపి, జనసేన పార్టీలు సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల సమన్వయం కోసం ఓ కమిటీని ఏర్పాటుకు సిద్దమయ్యారు.

TDP, Janasena
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన జనసేనాని అక్కడే టిడిపి-జనసేన పొత్తుపై కీలక ప్రకటన చేసారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి,జనసేన కలిసే పోటీచేయనున్నట్లు పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుపార్టీల లీడర్లు, క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లేందుకు సీనియర్లతో ఓ కమిటీ ఏర్పాటుకు సిద్దమయ్యారు. ఇప్పటికే టిడిపి, జనసేన సమన్వయ కమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లు... రేపో, ఎల్లుండో ప్రకటన వెలువడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
yanamala ramakrishnudu
సమన్వయ కమిటీలో టిడిపి, జనసేన పార్టీలకు చెందిన 12మంది సభ్యులు వుండనున్నట్లు... ఇప్పటికే వీరి పేర్లు కూడా ఖరారయినట్లు సమాచారం. ఈ కమిటీకి టిడిపి తరపున మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ కమిటీ ఏర్పాటు ప్రకటన వెలువడనున్నట్లు... సెప్టెంబర్ 12న ఈ కమిటీ మొదటి సమావేశం జరిగే అవకాశం వుంది.
pawan kalyan
ప్రస్తుతం వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవన్ కల్యాణ్ జనసేన నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 9 నుండి 12 వరకు ముఖ్య నాయకులతో భవిష్యత్ రాజకీయాలపై చర్చించేందుకు పవన్ భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే టిడిపితో కలిసి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నాయకుల అభిప్రాయాలను పవన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇరుపార్టీలు కలిసి ఏర్పాటుచేస్తున్న సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణపై జనసేన నాయకులతో పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Nara Lokesh
ఇక తండ్రి చంద్రబాబు అరెస్ట్ తర్వాత దేశ రాజధాని న్యూడిల్లీకి వెళ్ళిన లోకేష్ ఇటీవలే రాష్ట్రానికి తిరిగివచ్చారు. దీంతో ఆయన కూడా జనసేనతో పొత్తు, ఇరుపార్టీల నాయకులతో సమన్వయ కమిటీ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై టిడిపి సీనియర్లతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని... రాజకీయ కక్షతోనే ఆయనను అరెస్ట్ చేసారని ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేపట్టేందుకు టిడిపి సిద్దమయ్యింది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై టిడిపి శ్రేణులు పలు రకాలుగా నిరసనలు, ఆందోళనలు చేపడుతుండగా... ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేనతో కలిసి ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలను కూడా చేపట్టాలని నిర్ణయించారు. దీనిపై చర్చించేందుకు లోకేష్ టిడిపి ముఖ్య నాయకులతో చర్చించనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.
TDP, Janasena
ఇకపై జగన్ సర్కార్ ను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో టిడిపి, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోరాటం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఇరుపార్టీలతో ఏర్పాటుకానున్న సమన్వయ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. అసెంబ్లీ ఎన్నికల వరకు నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోనే వుండేలా... ఈ సమయంలో టిడిపి, జనసేన పార్టీలను సమన్వయంతో వ్యవహరించేలా కమిటీ చూడనుంది.