ప్రాణాలుతీసిన ఈత సరదా... గుంటూరు బ్రాంచి కెనాల్లో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు
గుంటూరు బ్రాంచి కెనాల్ లో సరదాగా ఈతకు దిగి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో చోటుచేసుకుంది.
గుంటూరు: స్నేహితుడి ఇంట్లో శుభకార్యానికి హాజరై తిరిగివెళుతూ ముగ్గురు యువకులు మృతి చెందారు. మార్గమధ్యలో గుంటూరు బ్రాంచి కెనాల్ లో స్నేహితులంతా ఈతకు దిగగా నీటిప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోయారు. ఇలా ఈత సరదా యువకులను బలితీసుకుంది.
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో స్నేహితుడి ఇంట శుభకార్యానికి ఎనిమిదిమంది యువకులు హాజరయ్యారు. వీరంతా ఆటో, ద్విచక్రవాహనంలో గుంటూరుకు తిరుగుపయనం అయ్యారు. ఈ క్రమంలోనే కడగండ్ల వద్ద గుంటూరు బ్రాంచి కెనాల్ వద్ద ఆగిన వీరు సరదాగా నీటిలో ఈతకు దిగారు.
read more క్షణికావేశంలో మైనర్ బాలికపై అత్యాచారం... భయంతో నిందితుడి ఆత్మహత్యాయత్నం
అయితే కెనాల్ లో నీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో ఈతకు దిగిన ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. మిగతా స్నేహితులు, స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా నీటి ఉద్ధృతి ఎక్కువగా వుండటంతో సాధ్యపడలేదు. ఇలా కెనాల్ లో కొట్టుకుపోయింది జె.కోటేశ్వరరావు (భారత్పేట), పగడాల అశోక్ (జొన్నలగడ్డ), సామి సురేష్బాబు (నెహ్రూనగర్) గా గుర్తించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతయిన యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటికే సురేష్ బాబు మృతదేహం లభించింది. మిగతా ఇద్దరు కోటేశ్వరరావు, అశోక్ కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల్లో సురేష్ బాబు ఆటోడ్రైవర్ కాగా మిగతా ఇద్దరు ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు.