చిత్తూరు జిల్లాలో యువకుడి హత్య: ప్రేయసి సహా ఆమె తల్లిదండ్రుల అరెస్టు
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో యువకుడి హత్య కేసులో పోలీసులు అతని ప్రేయసితో పాటు ఆమె తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ధనశేఖర్ అనే యువకుడిని ప్రేయసి తండ్రి దారుణంగా హత్య చేశాడు.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. యువకుడి ప్రేయసితో పాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. గదిలో తన కూతురితో మాట్లాడుతున్న యువకుడు ధనశేఖర్ ను ఓ వ్యక్తి హత్య చేశాడు.
ఆ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. తమ కుమారుడు కనిపించకపోవడంతో ధనశేఖర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అతను హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ధనశేఖర్ చివరి కాల్ ను పరిశీలించి దాని ఆధారంగా సున్నపు బాబును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.
ధనశేఖర్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం ధనశేకర్ ను యువతి తండ్రి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత శవాన్ని బావిలో పడేశాడు. అయితే, శవం బావిలో నీటిపై తేలాడుతుండడం చూశాడు. శవాన్ని వెలికి తీసి నాలుగు ముక్కలుగా నరికి పోలంలో పాతిపెట్టాడు.
శుక్రవారంనాడు యువతి తండ్రిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో అసలు విషయం బయటపడింది. తాను ధనశేఖర్ ను హత్య చేసిన తీరును, ఆ తర్వాత ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టిన విషయాన్ని వివరించాడు.