చీకటి గదిలోకి తీసుకెళ్లి చితక్కొడుతూ... నాపై పోలీసుల థర్డ్ డిగ్రీ : టిడిపి నేత పట్టాభిరాం
గన్నవరం ఉద్రిక్తతల నేపథ్యంలో అరెస్టయిన కొమ్మారెడ్డి పట్టాభిరాం కోర్టులో సంచలన విషయాలు బయటపెట్టారు. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి తెలిపిసట్లు సమాచారం.
గన్నవరం : కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘర్షణల కేసులో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంతో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. టిడిపి కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, వైసిపి కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలిసి పట్టాభి అక్కడి వెళ్లారు. ఈ క్రమంలోనే దాడి సమయంలో పోలీసుల తీరును నిరసిస్తూ డిజిపి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పట్టాభితో పాటు మరికొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టాభిని ఎక్కడికి తరలించారో తెలియకపోవడంతో నిన్న(మంగళవారం) గందరగోళం నెలకొంది. పట్టాభికి ప్రాణహాని వుందంటూ ఆయన భార్య ఆందోళనకు దింగింది. ఈ క్రమంలో సాయంత్రం గన్నవరం కోర్టులో పట్టాభిని హాజరుపర్చగా తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు న్యాయమూర్తికి తెలిపారు.
తనను అరెస్ట్ చేసిన పోలీసులు ఎవ్వరికీ తెలియనివ్వకుండా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పట్టాభి తెలిపారు. స్టేషన్ లోని ఓ చీకటి గదిలోకి తనను ఈడ్చుకెళ్లి ముసుగు వేసుకుని వచ్చిన ముగ్గురు విచక్షణారహితంగా కొట్టారని అన్నారు. ముఖానికి టవల్ చుట్టి అరికాళ్లు, అరచేతులపై లాఠీలతో కొడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పట్టాభిరాం న్యాయమూర్తికి తెలిపినట్లు సమాచారం.
అయితే పోలీసులు మాత్రం పట్టాభి తమతో దురుసుగా ప్రవర్తించాడని అంటున్నారు. గన్నవరంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న తనకు హాని కలిగించేలా పట్టాభి మరియు టిడిపి నాయకులు యత్నించారని సిఐ కనకరావు ఫిర్యాదు చేసారు. కులం పేరుతో దూషించారని సీఐ పిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పట్టాభితో పాటు దొంతు చిన్నా, మరికొందరు టిడిపి నాయకులకు అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేసారు. ఈ కేసులోనే గన్నవరం న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
Read More పట్టాభిని కలవనిస్తారా .. లేదా, బిల్డింగ్ ఎక్కిన టీడీపీ కార్యకర్తలు : గన్నవరంలో హైటెన్షన్
అంతకుముందు పట్టాభిరాం ఆచూకీ తెలపాలంటూ ఆయన భార్య చందన ఆందోళన చేపట్టారు.గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి ఘటన తర్వాత తన భర్త కొమ్మారెడ్డి పట్టాభిరాం కనిపించడం లేదంటూ చందన ఆందోళనకు దిగారు. సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన తన భర్తను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదు... ఆయనకు ఏదయినా హాని తలపెడితే సీఎం జగన్, డిజిపి బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. భర్త ఆచూకీ తెలపాలంటూ చందన డిజిపి ఇంటిముందు ధర్నాకు సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు... దీంతో తన ఇంటిముందే కుటుంబసభ్యులతో కలసి దీక్ష చేపట్టారు.
ఇలా భర్త ఆఛూకీ కోసం ఆందోళన చేపడుతున్న చందనకు టిడిపి నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారు. వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా భర్త కోసం ఆందోళన చేపట్టిన చందనకు ఫోన్ చేసి పరామర్శించడంతో పాటు ధైర్యం చెప్పారు. ఏపీ నూతన గవర్నర్ నజీర్ ను కలిసి పరిస్థితిని వివరిస్తానని... అధైర్యపడొద్దని చందనకు భరోసా ఇచ్చారు రఘురామ. ఈ క్రమంలోనే ఆయనను తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో వున్నట్లు తెలిసింది.