దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత.. ముగ్గురు మృతి, 100 మందికి పైగా గాయాలు...
దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో చెట్టు కూలడంతో ఇద్దరు మృతి చెందారు. తొక్కిసలాటలో మరో వ్యక్తి మృతిచెందాడు. పలువురికి గాయాలయ్యాయి. దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఇనుపరింగుల కర్రలతో భక్తులు పాల్గొన్నారు. దుండగులు కాగడాల దివిటీలను గాలిలోకి ఎగురవేశారు.

కర్నూలు : దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రల సమరంలో 100 మందికి పైగా గాయపడ్డారు. ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఆస్పరికి చెందిన బాల గణేష్ గా గుర్తించారు. కర్నూలులోని దేవరగట్టులో జరిగిన ఈ ఉత్సవాల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఇనుపరింగుల కర్రలతో కర్రల సమరానికి వచ్చారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతున్న సమయంలో కొంతమంది దుండగులు కాగడాల దివిటీలను గాలిలోకి ఎగరేశారు. దీంతో గొడవ మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..
దేవరగట్టు కర్రల సమరాన్ని చూసేందుకు స్థానికులు కొంతమంది సమీపంలోని చెట్టు ఎక్కారు. అయితే, ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మ విరిగిపడింది. అది అక్కడే ఉన్న గణేష్ అనే యువకుడు మీద పడడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, 100 మందికి పైగా భక్తులు గాయపడినట్లుగా సమాచారం. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. కాగా క్షతగాత్రులందరినీ ఆలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించండి : నిర్మలా సీతారామన్ను కోరిన పురందేశ్వరి
తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ మంగళవారం అర్ధరాత్రి బన్నీ ఉత్సవాన్ని కొనసాగించారు. మరోసారి దేవరగట్టులో సంప్రదాయమే గెలిచింది. ఎన్నిసార్లు వారించిన కర్రల సమరం యధావిధిగా కొనసాగింది. ఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు మాళ ఈశ్వర స్వామిని వీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
కళ్యాణోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా జైత్రయాత్రకు బయలుదేరిన సమయంలో గట్టుపై నుంచి కిందకు వచ్చి సింహాసన కట్ట దగ్గర ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సమయంలోనే నెరణికి, కొత్తపేట, నెరణికి తండా, బిలేహాల్, ఆలూరు, సులువాయి, ఎల్లార్తి గ్రామాల మధ్య కర్రల సమరం సాగింది. సమయంలో కొందరు కర్రలను అటు ఇటు ఊపుతూ భయాందోళన గురి చేయడంతో ఉత్కంఠ నెలకొంది.