గుంటూరులో జరిగింది వైసీపీ ప్లీనరీ కాదని, అది జగన్ భజన సభంటూ సెటైర్లు వేశారు టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత. న్నికల్లో తల్లిని, చెల్లిని వాడుకొని సీఎం అయ్యాక ఇద్దరినీ పక్కనబెట్టారని ఆమె దుయ్యబట్టారు. 

గుంటూరులో రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లీనరీపై (ysrcp plenary) విమర్శలు గుప్పించారు టీడీపీ నేత , మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత (vangalapudi anitha) . శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్లీనరీలో జగన్ నామ స్మరణే కనిపించిందని చురకలు వేశారు. విజయమ్మకు రాజకీయ భవిష్యత్ సమాధి కట్టారని.. జగన్ (ys jagan) సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఎక్కడా కనిపించలేదని అనిత ఎద్దేవా చేశారు. విజయమ్మను (ys vijayamma) ఇప్పుడు పదవి నుంచి ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణను షర్మిలకు (ys sharmila) .. ఆంధ్రాను జగన్ కు పంచుతున్నారని, వీలైతే ఆస్తులు పంచాలంటూ అనిత హితవు పలికారు. 

ఎన్నికల్లో తల్లిని, చెల్లిని వాడుకొని సీఎం అయ్యాక ఇద్దరినీ పక్కనబెట్టారని.. ఒక పార్టీకి శాశ్వత అధ్యక్షుడు వుండరని, ఐదేళ్లు రాజ్యాంగబద్ధంగా వుండాలని ఆమె పేర్కొన్నారు. ప్లీనరీలో ప్రజా సమస్యలపై ఏ ప్రసంగం లేదని... కేవలం తిట్లు కోసమే పెట్టారంటూ అనిత దుయ్యబట్టారు. మహిళా మంత్రుల నోట్లో సినిమా డైలాగులు, జబర్దస్త్ జోకులు తప్పించి ఏం లేవని ఆమె సెటైర్లు వేశారు. మహిళా సాధికారత కోసం మీరేం చేస్తున్నారని అనిత నిలదీశారు. అమ్మఒడి, ఒంటరి మహిళ పెన్షన్, మహిళ ల కోసం పెట్టిన సంక్షేమ పథకాలు ఏమైనా అమలు అవుతున్నాయా అని ఆమె ప్రశ్నించారు. మద్య పానం నిషేధం ఎక్కడ అని దుయ్యబట్టారు. మద్యపానం నిషేధం పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడుతున్నారని.. రాష్ట్రంలో ఏ బ్రాండ్స్ తీసుకొచ్చారని అనిత ప్రశ్నించారు. 

రాంబిలిలో ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగితే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె నిలదీశారు. పోలీసులు లేకుండా బయటకు రావాలని అనిత సవాల్ విసిరారు. 3,000 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదన్న ఆమె.. ఆరోగ్యశ్రీ ఎక్కడ పనిచేస్తుందన్నారు. హాస్పిటల్స్ బిల్లులు కూడా ఇవ్వలేని స్ధితిలో పాలకులు వున్నారని.. భజన మాత్రమే చేస్తున్నారంటూ చురకలు వేశారు. 

ALso Read:ముగిసిన వైసీపీ ప్లీనరీ.. ఎన్నికలపై క్యాడర్‌కు జగన్ ఏం సూచనలు చేశారంటే..?

విజయమ్మ అంటే తనకు గౌరవం.. ఆమె కూర్చొన్న వేదికపై అమ్మనా భూతులు తిడుతుంటే ఎందుకు స్పందించలేదని అనిత నిలదీశారు. ఆమె పదవిలో వుండగా ఎవరికి న్యాయం జరిగిందని ఆమె ప్రశ్నించారు. సామాజిక న్యాయంపై మహిళా హోమ్ మంత్రి మాట్లాడుతున్నారని.. దళితులకు, బీసీలకు న్యాయం జరిగితేనే సామాజిక న్యాయమని అనిత వ్యాఖ్యానించారు. డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రమణ్యం వరకు దళితులను పొట్టనపెట్టుకున్న ప్రభుత్వమని ఆమె మండిపడ్డారు. బీసీలకు కాకుండా రెడ్డిలకు న్యాయం జరిగిందని.. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే న్యాయం జరిగిందని అనిత చురకలు వేశారు. దీనిని ప్లీనరీ కంటే జగన్ భజన సభ అంటే బాగుంటుందని ఆమె దుయ్యబట్టారు. 

దిశ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారని అనిత ప్రశ్నించారు. పాఠశాలలను విలీనం చేసి పిల్లలను సైతం రోడ్డు మీదకు ఎక్కించారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబును చూస్తే వణుకు పుడుతోందని.. ఆయన పెట్టుకున్న ఉంగరాన్ని కూడా రాజకీయం చేస్తారా అని అనిత ఎద్దేవా చేశారు. చంద్రబాబు విజన్ చూసి వైసీపీ భయపడుతోందని.. బయటకు ప్రజల పార్టీ అని, లోపల దోచుకున్న పార్టీ అంటూ ఆమె సెటైర్లు వేశారు.