Asianet News TeluguAsianet News Telugu

మాధవ్‌కు హోర్డింగ్‌లు.. చివరికి మహిళా మంత్రుల సపోర్ట్ కూడానా, సిగ్గుచేటు : వంగలపూడి అనిత

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను మహిళా మంత్రులు వెనకేసుకుని రావడం సిగ్గుచేటన్నారు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. అమెరికా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకునే దమ్ము ఉందా అని వంగలపూడి సవాల్ విసిరారు. 
 

telugu mahila president vangalapudi anitha fires on ysrcp mp gorantla madhav video issue
Author
Amaravati, First Published Aug 13, 2022, 2:49 PM IST

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Gorantla madhav)పై మరోసారి విమర్శలు చేశారు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాధవ్ వ్యవహారాన్ని మహిళా మంత్రులు కూడా వెనకేసుకు రావడం సిగ్గుచేటన్నారు. గోరంట్ల విషయంలో ఎస్పీ ఫకీరప్ప (SP Fakirappa) క్లీన్‌చిట్ ఇవ్వలేదని అనిత వ్యాఖ్యానించారు. కేవలం ఒరిజినల్ వీడియో లేదని మాత్రమే అన్నారని ఆమె గుర్తుచేశారు. ఒరిజినల్ వీడియో దొరికితే విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారని అనిత తెలిపారు. అమెరికా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకునే దమ్ము ఉందా అని వంగలపూడి సవాల్ విసిరారు. ఈ రిపోర్ట్‌పై కూడా ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తారా అంటూ ఆమె చురకలు వేశారు. సిగ్గులేకుండా మాధవ్‌ హోర్డింగ్‌లు పెట్టించుకున్నారని అనిత ఫైరయ్యారు. 

అంతకుముందు.. గోరంట్ల వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పినందుకు తనను దేశద్రోహిగా చిత్రీకరించి.. చిత్రహింసలు పెట్టి.. ఊరికి రాకుండా ఎప్పటికప్పుడు కేసులు పెడుతున్న తమ పార్టీ ప్రభుత్వం.. నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ కు 500కార్లతో  భారీ స్వాగతం పలకడం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశం తమవైపు చూస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరుచూ చెబుతుంటారని, ఈ రకమైన ప్రోత్సాహంతో నిజంగానే దేశమంతా తమ వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలపై ఇప్పటికే చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఆస్తిపన్ను పేరిట భారాన్ని మోపిన జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇంపాక్ట్ పన్ను భారంతో ఎన్నికలకు వెడితే జనం తమను ఉతికి ఆరేస్తారని పేర్కొన్నారు. విజయమ్మ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని కోరారు. ఒకే సమయంలో రెండు టైర్లు బద్దలవ్వడం వెనక ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాలని రఘురామ డిమాండ్ చేశారు.

Also Read:గోరంట్ల మాధవ్ కు 500 కార్లతో స్వాగతమా? ఇలా చేస్తేనే దేశమంతా మీ వైపే చూస్తారు... ఎంపీ రఘురామ ఎద్దేవా..

కాగా, రాష్ట్ర ప్రజలు, అక్క చెల్లెలు, తల్లులు సెల్ ఫోన్లు చూడొద్దని మొట్టమొదటిసారి విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందని సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ‘వాంటెడ్ పండుగాడు’ చిత్ర యూనిట్ గురువారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొంది.  ఎంపీ గోరంట్ల మాధవ్ దిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పృథ్వీరాజ్ స్పందించారు వరలక్ష్మీ వ్రతం ముందు రోజే వచ్చిన ఆ దరిద్రాన్ని తాను చూశానని అందుకే మిగిలిన వారిని చూడొద్దని చెప్పానని అన్నారు.

దేశ చరిత్రలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ లేదన్నారు.  పార్లమెంటు అంటే పవిత్ర దేవాలయమని భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన సమరయోధులు ఎందరో అందులో కొలువై ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వాళ్ళు ఉండాల్సిన చోట ఇలాంటి వారు ఉన్నారని విమర్శించారు. ‘ గతంలో వారం రోజుల పాటు  నా మీద ప్రెస్ మీట్ పెట్టారు.. ఇప్పుడేవి?’  అని ప్రశ్నించారు.  ప్రస్తుతం ఒక ప్రెస్ మీట్  లేదన్నారు. ‘ అనంతపురం  ఎస్.పి  విలేకరుల సమావేశం పెడుతున్నట్లు ఆయనకు ఎలా తెలుసు? ఎస్పీ మాట్లాడుతున్నప్పుడే.. మాధవ్ ఢిల్లీలో మాట్లాడారు. ఇంగ్లాండ్ నుంచి అప్లోడ్ అయింది. ఎవరో చేశారు. ఒరిజినల్ క్లిప్ ను కనిపెట్టలేకపోయాం… అంటూ ఎస్పీ మాటలు చాలా దీనంగా ఉన్నాయి.

ఫోరెన్సిక్ నిపుణులు అరగంటలో వాస్తవం తేలుస్తారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటూనే ఫేక్ అని తేల్చేశారు. వాళ్ల కోర్టులో అది ఫేక్ దేనని  తేలుతుంది. అంతకుమించి వేరే ఏమి రాదు. ఆయన పృద్వి కాదు కదా.. మాకు అంగ బలం అర్ద బలం ఉంటే.. అద్భుతం అంటారు’ అని పృథ్వీరాజ్ వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios