తెలంగాణ ఎన్నికల ఫలితాలు వ్యక్తిగతంగా చంద్రబాబుపై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. లోకసభతో పాటు ఏప్రిల్ లేదా మేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. 

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. జాతీయ మీడియా అంచనా వేసినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తెలంగాణలో విజయం సాధిస్తే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వ్యక్తిగతంగా చంద్రబాబుపై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. లోకసభతో పాటు ఏప్రిల్ లేదా మేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణ ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపైనే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందువల్ల తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలపైనే కాకుండా జాతీయ స్థాయిలో ఆయన వ్యక్తిగత పాత్రపై పడే అవకాశం ఉంది. 

ప్రజా కూటమి విజయం సాధిస్తే జాతీయ స్థాయిలో బిజెపియేతర కూటమిలో ఆయన కీలక నేతగా ఆవిర్భవిస్తారు. అది ఎపిలో టీడీపికి ఉపయోగపడుతుంది. టీఆర్ఎస్ విజయం సాధిస్తే ఎపిలో టీడీపిపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా చంద్రబాబుకు వ్యక్తిగత కష్టకాలం ప్రారంభమవుతుంది. 

తాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడుతామని కేటీఆర్ చెప్పిన మాటను ఇక్కడ విస్మరించకూడదు. టీఆర్ఎస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రత్యర్థి పార్టీలకు కేసీఆర్ కాకున్నా కేటీఆర్ ప్రచారం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో ఓటుకు నోటు కేసును టీఆర్ఎస్ తిరగదోడే అవకాశం కూడా లేకపోలేదు.