తెలంగాణలో అదృశ్యమైన ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో మృతదేహంగా తేలాడు. కాలిపోయి.. కుళ్లిన స్తితిలో ఆయన మృతదేహం దొరికింది.
కర్నూలు : తెలంగాణకు చెందిన ఓ హత్య కేసు మిస్టరీ ఏపీలోని కర్నూలులో వీడింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణపురానికి చెందిన కావాలి భారతయ్య (55) ఇటీవల కనిపించకుండా పోయాడు. దీనిమీద కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని కర్నూలు జిల్లాలో చేదించారు. ఆయనను కిడ్నాప్ చేసిన హంతకులు.. ఆ తర్వాత చంపేసి.. కల్లూరు మండలం పులిందకొండ పోలీస్స్టేషన్ పరిధిలో దహనం చేశారు.
ఆదివారం నాడు ఈ ఉదంతం వెలుగు చూసింది. దీని గురించి వివరాలను పోలీసులు తెలిపారు. మూడేళ్ల కిందట రవీంద్ర గౌడ్ అనే రామకృష్ణ పురానికి చెందిన మాజీ కల్లు దుకాణ నిర్వాహకుడి భార్య ఆత్మహత్య చేసుకుంది. అతను గతంలో కల్లు దుకాణాన్ని నిర్వహించేవాడు. కాగా ఆమె మృతికి భర్త రవీంద్ర గౌడ్ వేధింపులే కారణం అంటూ గ్రామస్తులు అతడిని విపరీతంగా కొట్టారు.
రాజకీయ ఒత్తిళ్ళతోనే సిఐ ఆనందరావు ఆత్మహత్య : జేసీ ప్రభాకర్ రెడ్డి
ఆ సమయంలో భారతయ్య రవీంద్ర గౌడ్ ను చెప్పుతో కొట్టాడు. దీంతో భారతీయ్య మీద రవీంద్ర గౌడ్ కక్ష పెంచుకున్నాడు. భార్య హత్య కేసులో జైలుకు వెళ్లిన రవీంద్ర గౌడ్.. జైలు నుంచి వచ్చిన తర్వాత భారతయ్యను చంపడానికి ప్లాన్ చేశాడు. మహమ్మద్ షఫీ అనే వ్యక్తితో జైలులో పరిచయమైంది రవీందర్ గౌడ్ కి. అతనితో కలిసి భారతయ్యను చంపడం కోసం పథకం వేశాడు.
ఈ పథకంలో భాగంగానే జూన్ 26వ తేదీన అప్పరాల గ్రామం దగ్గర భారతయ్య ఆటో కోసం ఎదురుచూస్తుండగా.. కారులో అక్కడికి వచ్చిన రవీంద్ర గౌడ్.. ఊరి దగ్గర దింపుతాను అంటూ కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత పథకం ప్రకారం తన దగ్గర ఉన్న రుమాలతో గొంతు బిగించాడు. రాడుతో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి… కల్లూరు మండలం కొల్లంపల్లి తండా సమీపంలో పడేశాడు.
మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండడం కోసం.. పెట్రోల్ పోసి..నిప్పంటించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు ఎంతకీ భారతీయ ఇంటికి రావడం రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. భార్య శివమ్మ భర్త మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసుల విచారణ క్రమంలో కుటుంబ సభ్యులు రవీంద్ర గౌడ్ మీద అనుమానం వ్యక్తపరిచారు. దీంతో పోలీసులు రవీంద్ర గౌడ్ ను తీసుకెళ్లి విచారించగా హత్య విషయం వెలుగు చూసింది.
ఆదివారం ఘటనా స్థలానికి కొత్తకోట సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మంజునాథరెడ్డి, పులిందకొండ ఎస్సై నల్లప్ప పరిశీలించారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
