తెలంగాణ ప్రాజెక్టులపై పార్లమెంటులో వైసీపీ ఎంపీల ఆందోళన: తీవ్ర గందరగోళం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న జల జగడం పార్లమెంట్ ను తాకింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆయన ఆరోపించారు.
అమరావతి: కృష్ణా జలాలను నిబంధనలకు విరుద్దంగా ఉపయోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గురువారం నాడు పార్లమెంట్లో లేవనెత్తారు.గురువారం నాడు లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆయన ఆరోపించారు. అనుమతులు లేకుండానే ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తోన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయని ఆయన చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అసలు అనుమతులు లేవని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నిబంధనలకు విరుద్దంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ చేపట్టిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసినా కూడ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ను ఉత్పత్తి చేసిందన్నారు.ఈ విషయమై కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ సమాధానమిచ్చారు. ఏపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి లేవనెత్తిన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల పరిధిలోకి తీసుకొచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.శ్రీశైలం సహా ఇతర ప్రాజెక్టుల నుండి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కూడ తాము కేఆర్ఎంబీ ద్వారా ఆదేశాలు జారీ చేశామని మంత్రి చెప్పారు.