వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్ట్ శుక్రవారానికి వాయిదా వేసింది.
![telangana high court hearing on kadapa mp ys avinash reddys anticipatory bail plea in ys viveka murder case adjourned ksp telangana high court hearing on kadapa mp ys avinash reddys anticipatory bail plea in ys viveka murder case adjourned ksp](https://static-ai.asianetnews.com/images/01d682per0tzcbabye49rpgcnb/avinash-reddy_363x203xt.jpg)
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్ట్ శుక్రవారానికి వాయిదా వేసింది. అంతకుముందు ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను న్యాయస్థానం వినింది. దస్తగిరి వాంగ్మూలాన్ని ఎలా పరిగణనలోనికి తీసుకుంటారని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ వివేకా కేసులో దస్తగిరే హంతకుడని.. అతనే స్వయంగా పాల్గొన్నాడని న్యాయవాది వ్యాఖ్యానించారు.
అతను అరెస్ట్ అయినప్పుడు ఈ కేసులో ఐదుగురు వున్నారని ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత సీబీఐ తీసుకున్న మరో స్టేట్మెంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి పేర్లు వున్నాయని అవినాష్ లాయర్ వాదించారు. దస్తగిరి తొలి స్టేట్మెంట్లో లేని వీరిద్దరి పేర్లు.. తర్వాత ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అలాగే దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా సీబీఐ వ్యతిరేకించలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ALso Read: వివేకా చివరిగా రాసిన లేఖ కంటే ప్రసాద్నే నమ్ముతారా?.. వాళ్ల వైపు తప్పు ఉంది: అవినాష్ రెడ్డి సంచలనం
అవినాష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకునే సీబీఐ దర్యాప్తు చేస్తోందని.. గూగుల్ టేకౌట్ ఎలా కీలకంగా మారుతుందని ఆయన వాదించారు. అవినాష్ రెడ్డి జమ్మలమడుగు ప్రచారానికి వెళ్తుండగా .. వివేకా చనిపోయిన విషయం తెలిసిందని న్యాయవాది కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. గూగుల్ టేక్ అవుట్ ఫోన్ ఎక్కడుందో చెబుతుందే కానీ.. వ్యక్తి లోకేషన్ గురించి చెప్పదని ఆయన వాదించారు. అనంతరం వైఎస్ సునీతా రెడ్డి తరపున సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. రక్తపు మడుగులో మృతదేహం కనిపిస్తుంటే గుండెపోటని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వివేకా, అవినాష్ రెడ్డి ఇళ్లకు 500 మీటర్ల దూరం వుందని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది.