వివేకా చివరిగా రాసిన లేఖ కంటే ప్రసాద్నే నమ్ముతారా?.. వాళ్ల వైపు తప్పు ఉంది: అవినాష్ రెడ్డి సంచలనం
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఏం జరిగిందనేది ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు.
![YS Viveka Murder Case YS Avinash Reddy Sensational comments on Sunitha Reddy and her Husband ksm YS Viveka Murder Case YS Avinash Reddy Sensational comments on Sunitha Reddy and her Husband ksm](https://static-ai.asianetnews.com/images/8937230d-8670-4e81-b18e-d01b3582ab44/image_363x203xt.jpg)
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోను అవినాష్ రెడ్డి ఎప్పుడూ రికార్డు చేశారనే దానిపై స్పష్టత లేదు. అందులో అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఏం జరిగిందనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆ రోజు ఉదయం 6.30 గంటల సమయంలో శివప్రకాష్ రెడ్డి తనకు ఫోన్ చేశారని తెలిపారు. అప్పటికే తాను జమ్మలమడుగుకు బయలుదేరానని చెప్పారు. పులివెందుల రింగ్ రోడ్డు వద్దకు చేరుకున్న సమయంలో తనకు శివప్రకాష్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. తాను అక్కడికి వెళ్లకముందే లెటర్, మొబైల్ ఫోన్ దాచిపెట్టమని పీఏ కృష్ణారెడ్డికి సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పారని అన్నారు. ఈ కేసులో లెటర్ అత్యంత కీలకమని చెప్పారు. సీబీఐ అధికారి రామ్ సింగ్ వైఖరి తేడా ఉందని ఆరోపించారు.
‘‘శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి అర్జెంట్గా వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లమని చెప్పారు. ఎందుకు అని అడిగితే.. వివేకానందరెడ్డి చనిపోయారని తెలిపారు. నేను వెంటనే అక్కడి నుంచి వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లాను. పోయిన వెంటనే కృష్ణారెడ్డి వివేకానందరెడ్డి చనిపోయాడు.. డెడ్ బాడీ బాత్రూమ్లో ఉందని చెప్పాడు. బెడ్ రూమ్లో నుంచి బయటకు వచ్చే ముందు.. ఏమైనా అనుమానస్పదంగా ఉన్నాయా? అని కృష్ణారెడ్డిని అడిగాను. ఏం లేవని కృష్ణారెడ్డి చెప్పాడు. అక్కడికి నేను వెళ్లకముందే.. వివేకానందరెడ్డి రాసిన లెటర్, మొబైల్ ఫోన్ ఉన్నాయి. ఈ విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి.. వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే రాజశేఖర్ రెడ్డి వెంటనే ఆ లెటర్ను, మొబైల్ ఫోన్ను దాచిపెట్టమని కృష్ణారెడ్డికి చెప్పాడు. ఈ విషయాలు నిజంగానే ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
ఆ లెటర్లో వివేకానందరెడ్డి.. ‘నా డ్రైవర్ నేను డ్యూటీకి త్వరగా రమ్మనందుకు చచ్చేలా కొట్టాడు. ఈ లెటర్ రాసేందుకు నేను చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దు’ అని పేర్కొన్నారు. ఇది వివేకానందరెడ్డి రాసిన చివరి మాటలు. వివేకానందరెడ్డిది హత్య అని చెప్పడానికి లెటర్ అనేది చాలా కీలక ఆధారం. ఈ లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారని అడిగితే.. ప్రసాద్ చాలా మంచోడు అని, ఆయనను ఎవరైనా ఎమైనా అంటారని దాచిపెట్టమన్నట్టుగా రాజశేఖర్ రెడ్డి, సునీత చెబుతారు. సునీతా వాళ్ల నాన్నను నమ్మదా?. వాళ్ల నాన్న చివరి సారిగా రాసిన లేఖ, మాటలను నమ్మరా?. ప్రసాద్నే ఎక్కువ నమ్ముతారా?. ఇది వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. సీబీఐ స్టేట్మెంట్లో సునీతా ఒక్కో స్టేట్మెంట్ ఒక్కో మాదిరిగా చెబుతుంది. ఒక్క స్టేట్మెంట్ చాలా వివరంగా చెబుతుంది. తర్వాత స్టేట్మెంట్లో తప్పులను కవర్ చేస్తుంది. తాను అలా అనలేదని, మర్చిపోయానని చెబుతుంది.
సీబీఐ వాళ్లకు చాలా స్వేచ్చ ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి, సునీత చేసిన మిస్టేక్స్ను కవర్ చేసుకునే స్వేచ్చ ఇస్తుంది. ఈ విధంగా లెటర్ ఉందని సమయానికి పోలీసులకు గానీ, తనకు గానీ చెప్పకపోవడం.. ఈ కేసులో అతిపెద్ద తప్పు. అటువంటి ఆధారాన్ని దాచిపెడితే సీబీఐ విచారణలో రామ్ సింగ్ అనే దానిని డౌన్ ప్లే చేశారు. ఈ అంశం నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. సీబీఐ మొత్తాన్ని నేను బ్లేమ్ చేయడం లేదు. రామ్ సింగ్ వైఖరి మాత్రం తేడాగా ఉంది. లేటర్ను డౌన్ ప్లే చేయడం ఎవరిని కాపాడేందుకు?. శివప్రకాశ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సునీతను కాపాడేందుకు రామ్ సింగ్ ఇదంతా చేశారు. వాళ్లు చేసేది తప్పు. లెటర్ గురించి సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం అతిపెద్ద తప్పు.
లెటర్ దాచిపెట్టమని వాళ్లు పోలీసులకు ఫోన్ చేసి చెప్పి ఉండొచ్చు కదా?. వాళ్లు ఎందుకు పోలీసులకు ఫోన్ చేయలేదు?. నాకు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసిన తర్వాత.. నేను అక్కడి వెళ్లి 6. 45 గంటల ప్రాంతంలో ఫస్ట్ పోలీసుకు ఫోన్ చేశారు. అయితే వాళ్లకు 6.10 గంటలకు వివేకానందరెడ్డి చనిపోయారని తెలిసిన కూడా, లెటర్ ఉందని తెలిసిన కూడా, మర్డర్ అని తెలిసిన కూడా.. ఎందుకు వాళ్లు పోలీసులకు చెప్పలేదు?. నన్ను వివేకా ఇంటికి వెళ్లమని చెప్పారని.. కానీ అక్కడ లెటర్, మొబైల్ ఫోన్ దాచిపెట్టమని కృష్ణారెడ్డి చెప్పిన విషయం ఎందుకు చెప్పలేదు?. నా మీద నమ్మకం లేకుంటే ఎందుకు పోమ్మని చెప్పారు. వాళ్ల ఉద్దేశాలు తప్పు. వాళ్ల వైపు తప్పు ఉంది కాబట్టే.. లెటర్, మొబైల్ ఫోన్ దాచిపెట్టమని చెప్పారు.
నేను సీఐకి ఫోన్ చేసి.. వివేకానందరెడ్డి చనిపోయారు, చాలా రక్తం ఉందని మాత్రమే చెప్పాను. ఎలా చనిపోయాడని అడిగితే.. చాలా రక్తం ఉంది, బాత్ రూమ్ కూడా రక్తం ఉంది తొందరగా రండి అని చెప్పాను’’ అని వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
అవినాష్ రెడ్డి ప్రశ్నలు..
వివేకానందరెడ్డి గురించి కొన్ని విషయాలు మాట్లాడలేక.. చనిపోయిన వ్యక్తి కూతురు, అల్లుడు గురించి మాట్లాడకలేక తనపై, తన తండ్రిపై ఎన్ని విమర్శలు వచ్చినా మాట్లాడలేకపోయానని అన్నారు. అయితే సీబీఐ విచారణకు రెండు సార్లు హాజరైనా తర్వాత వాళ్లు తప్పుదోవలో వెళ్తున్నారని తనకు అర్థమైందని చెప్పారు. ఇందుకు సంబంధించి తనకు తెలిసిన విషయాలు చెప్పదలచుకున్నానని తెలిపారు. అనవసరమైన విషయాల జోలికి పోకుండా.. సీబీఐ వేసిన రెండు చార్జ్షీట్లు, వాళ్లు కోర్టుకు ఇచ్చిన సాక్షుల స్టేట్మెంట్స్, వివిధ సంరద్భాల్లో కోర్టుల్లో వేసిన కౌంటర్ అఫిడవిట్స్, విచారణ సందర్భంగా సీబీఐ తనకిచ్చిన ప్రశ్నావలిని ఆధారంగా చేసుకుని మాత్రమే తాను మాట్లాడతానని చెప్పారు.
ఈ కేసులో అబద్దానికి మొత్తం అప్రూవర్ థీయరి పునాదిని నిర్మించారని ఆరోపించారు. కేసులో ఒక్కరిని అప్రూవర్గా చేసేటప్పుడు పాటించిన నిబంధనలు సరైనవా? కావా? అని ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. వాచ్మెన్ రంగన్న.. నలుగురు వ్యక్తులు చంపినట్టుగా సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పారు. ఆ నలుగురిలో ఒక్కరిని అప్రూవర్గా మార్చాల్సిన అవశ్యకత ఉందా? లేదా? అనేది ఆలోచన చేయాలని అన్నారు. అప్రూవర్గా మారిన పూర్వపరాలు పరిశీలించాల్సి ఉందని.. అతడు రికార్డుల ప్రకారం కిరాయి కిల్లర్ అని తెలిపారు. అతడు డబ్బు కోసం వ్యక్తిత్వ హననం చేయడనే గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిని అప్రూవర్గా తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
ఒక హత్యలో పాత్ర ఉన్న వ్యక్తిని అప్రూవర్గా చేయడం తేడాగా కనిపిస్తుందని అన్నారు. అతడిని అప్రూవర్గా మార్చాలని సీబీఐ నిర్ణయం తీసుకున్న తర్వాత సునీతా రెడ్డి మౌనంగా ఉండటం ఇంకా ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. తండ్రిని చంపిన వ్యక్తిని ముద్దాయి నుంచి సాక్షిగా మారిస్తే సాధారణంగా పిల్లలు దర్యాప్తు సంస్థతో కొట్లాడుతారని.. ఇక్కడ మాత్రం వాళ్లు మౌనంగా ఉండటం చూస్తే అందరూ కుమ్మకయ్యారనేది స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.
ఏ-4గా ఉన్న అతడు నేరాన్ని అంగీకరించిన తర్వాత సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. సునీత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అతడు అప్రూవర్గా మారతానని లేఖ రాస్తాడని.. సీబీఐ వాళ్లు అతడికి బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారని అన్నారు. హత్య చేసిన కిరాయి రౌడీకి ఎందుకు ఇంతా రిలీఫ్ ఇచ్చారని ప్రశ్నించారు. అతడిని ఒక పావుగా వాడుకుని తమను టార్గెట్ చేయడం కోసమేనని.. అంతకంటే ఏం కారణం కనిపించడం లేదని అన్నారు.
దస్తగిరిని గానీ, సునీల్ యాదవ్ గానీ.. తాము గుర్తించే వ్యక్తులు కూడా కాదని అన్నారు. ఈ రెండేళ్లుగా పేపర్లు, టీవీల్లో పెద్దగా రావడం వల్ల వాళ్లను గుర్తించగలుగుతున్నామని చెప్పారు. వీళ్లు తమపై తప్పుడు సాక్ష్యాలు చెప్పడం, వెనకాల ఉండి సీబీఐ, సునీత ఇలా చెప్పించడం నిజంగా చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని అన్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయని అన్నారు.