Asianet News TeluguAsianet News Telugu

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు


కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  తెలంగాణ హైకోర్టు  ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది 

Telangana High Court  Grants   anticipatory bail to  Kadapa MP YS Avinash Reddy
Author
First Published May 31, 2023, 10:46 AM IST

హైదరాబాద్:  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి   ముందస్తు బెయిల్ లభించింది. ఈ మేరకు  బుధవారంనాడు  తెలంగాణ హైకోర్టు  ముందస్తు బెయిల్  ఇస్తూ  ఉత్తర్వులు  ఇచ్చింది. షరతులతో  కూడిన   ముందస్తు  బెయిల్ ను  తెలంగాణ హైకోర్టు  మంజూరు  చేసింది.   ప్రతి శనివారం  సీబీఐ విచారణకు హాజరుకావాలని  హైకోర్టు ఆదేశించింది. మరో వైపు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని  కూడా  హైకోర్టు  షరతు విధించింది.  విచారణకు  సహకరించాలని  హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించింది.

 ప్రతి శనివారం నాడు  ఉదయం  10 గంటల నుండి  సాయంత్రం  నాలుగు గంటల వరకు   విచారణకు హాజరు కావాలని  హైకోర్టు   కోరింది. రూ. 5 లక్షలతో  రెండు పూచీకత్తలను సమర్పించాలని  హైకోర్టు  ఆదేశించింది.  సాక్షులను  భయపెట్టడం,లేదా  ఆధారాలను  చెరపవద్దని  కూడా హైకోర్టు  ఆదేశించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై  బుధవారంనాడు తెలంగాణ హైకోర్టు ఇవ్వనున్నట్టుగా  ఈ నెల  27న  ప్రకటించిన విషయం తెలిసిందే.    

ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించేలా   తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను  ఆదేశించాలని  సుప్రీంకోర్టులో  వైఎస్ అవినాష్ రెడ్డి  ఈ నెల 22న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. పూర్తిస్థాయిలో విచారించి  తుది ఉత్తర్వులివ్వాలని  ఆ పిటిషన్ లో  అవినాష్ రెడ్డి  కోరారు.  ఈ పిటిషన్ పై   ఈ నెల  23న  సుప్రీంకోర్టు  విచారణ నిర్వహించింది.   ఈ నెల  25న  ఈ పిటిషన్ పై విచారణ  నిర్వహించాలని  తెలంగాణ హైకోర్టు  వేకేషన్ బెంచ్ ను  సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఈ నెల  25వ తేదీ నుండి  27వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది.  అన్ని వర్గాల వాదనలను  హైకోర్టు విన్నది.  ఈ నెల  31న  తుది తీర్పును వెల్లడించనున్నట్టుగా  తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్  తెలిపింది. 

ఇవాళ  ఉదయం పదిన్నర గంటలకు  తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టుగా  ప్రకటించింది.  అయితే  షరతులతో  కూడిన ముందస్తు బెయిల్ గా  కోర్టు తెలిపింది. సీబీఐ  వాదనలను  కోర్టు  పరిగణనలోకి తీసుకోలేదని   ముందస్తు బెయిల్ మంజూరైందని  వైఎస్ అవినాష్ రెడ్డి న్యాయవాది నాగార్జున రెడ్డి  చెప్పారు.   

Follow Us:
Download App:
  • android
  • ios