టార్గెట్ 2019: సర్వేలతో పవన్, బాబు, జగన్ రెడీ
కర్నూల్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరి బలమెంత, ఏ అభ్యర్ధికి టిక్కెట్టు కేటాయిస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనే విషయమై ప్రధాన పార్టీలు సర్వేలు నిర్వహిస్తున్నాయి
కర్నూల్: కర్నూల్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరి బలమెంత, ఏ అభ్యర్ధికి టిక్కెట్టు కేటాయిస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనే విషయమై ప్రధాన పార్టీలు సర్వేలు నిర్వహిస్తున్నాయి.ఈ సర్వేల ఆధారంగానే ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులకు టిక్కెట్లను కేటాయించనున్నాయి.
కర్నూల్ జిల్లాలో టీడీపీ, వైసీపీలు ఏ నియోజకవర్గంలో ఎవరిని రంగంలోకి దింపితే ప్రయోజనం ఉంటుందనే విషయమై అంతర్గతంగా సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ సర్వే ఆధారంగా టిక్కెట్లను కేటాయించనున్నాయి.
ఒక్కో పార్టీ పలు రకాల సర్వేలను నిర్వహిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కాలంటే ఈ సర్వేలనే ఆయా పార్టీలు ప్రామాణికంగా తీసుకోనున్నాయి. గత నాలుగేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీల పనితీరుపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నివేదికలు తెప్పించుకొంటున్నారు. ఈ నివేదికల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో బాబు టీడీపీ టిక్కెట్లను కేటాయించనున్నారు.
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఆయా నేతల భాగస్వామ్యానికి సంబంధించి పార్టీ పరిశీలకుల నివేదికల ఆధారంగా గ్రేడింగ్లు ఇస్తారు. అయితే తాజాగా నిర్వహిస్తున్న సర్వేలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుకు దోహదపడతాయని టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. మరోవైపు గతంలో మంచి గ్రేడింగ్లు వచ్చినా .. తాజా సర్వేలే టిక్కెట్ల కేటాయింపులే కీలకంగా మారనున్నాయి.
పలు రకాల సర్వే నివేదికలను తెప్పించుకొని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతల బలాబలాలను చంద్రబాబునాయుడు సమీక్షిస్తున్నారు. ఈ జిల్లాలో వైసీపీ బలాన్ని తగ్గించేందుకు ఏ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందనే విషయమై బాబు ఆరా తీస్తున్నారు.
మరోవైపు వైసీపీకీ గట్టి పట్టున్న జిల్లాగా కర్నూల్ జిల్లాను ఆ పార్టీ నేతలు చెబుతారు. అయితే నియోజకవర్గాల వారీగా పార్టీ నేతల బలాబలాను వైసీపీ చీఫ్ జగన్ సర్వే ద్వారా ఆరా తీస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరికీ టిక్కెట్టును కేటాయిస్తే వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం ఉంటుందనే విషయమై జగన్ సర్వే ద్వారా తెలుసుకొంటున్నారు. ఇప్పటికే పీకే టీమ్ కర్నూల్ జిల్లాలో వైసీపీ నేతల తీరుపై సమగ్ర నివేదికను అందించినట్టు సమాచారం.
అయితే ఈ నివేదిక ఆధారంగా కర్నూల్ జిల్లాకు చెందిన నేతలతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. సర్వేలో వచ్చిన సమాచారాన్ని పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నారు. త్వరలోనే ఆయన పార్టీ నేతలతో ఈ విషయమై చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం.కర్నూల్ జిల్లాలోని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు నియోజకవర్గ ఇంచార్జీలకు సర్వే ఫలితాలు ఆశాజనకంగా లేవని సమాచారం.
బీజేపీ, జనసేన నేతలు కూడ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి, బలమెంత అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుపై ఈ రెండు పార్టీలు కూడ కసరత్తు చేస్తున్నాయి.