అమరావతి నిర్మాణంలో జాప్యం వల్లనే తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో ఓడించారని బిజెపి ఎంపీ సుజనా చౌదరి అన్నారు. మూడు రాజధానుల వైఎస్ జగన్ ప్రతిపాదన హాస్యాస్పదమని సుజనా చౌదరి అన్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో జాప్యం వల్లనే ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో ఓడించారని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, అందువల్లనే టీడీపీని ఎన్నికల్లో ఓడించారని ఆయన అననారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమరావతిలో చాలా నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆయన ఆదివారం మీడియాతో అన్నారు. అమరావతిలో కేంద్రానికి చెందిన 130 సంస్థలకు భూముల కేటాయింపు జరిగిందని ఆయన చెప్పారు. రాజధానికి పలు విద్యా సంస్థలు కూడా వచ్చాయని అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతోందని, ఈ 7 నెలల్లో రాజధానిలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదని ఆయన అన్నారు. అమరావతిని స్వాగతిస్తూ 30 వేల ఎకరాలు చాలు అని ఆనాడు జనగ్ విపక్ష నేతగా జగన్ అన్నట్లు ఆయన గుర్తుచేశారు. అమరావతిని ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకించలేదని చెప్పారు. 

రాజధాని అంటే ఓ కారు తీసేసి మరో కారు కొనుక్కున్నట్లు కాదని, జగన్ కోరుకున్న చోట భవనాలు నిర్మించుకున్నట్లు కాదని ఆయన అన్నారు. రాజధాని మార్పునకు కారణాలు ఎందుకు చెప్పడం లేదని సుజనా ప్రశ్నించారు. జిఎన్ రావు కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చిందని అడిగారు. 

మూడు రాజధానులు అనేది హాస్యాస్పదమైన విషయమని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను, ఇతర సంస్థలను నెలకొల్పాలని అన్నారు. అధికార వికేంద్రీకరణ చేస్తే అభివృద్ధి జరగదని ఆయన అన్నారు.