చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ కమిటీ వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్దమయ్యింది. ఇందుకోసం పలు కీలక తీర్మానాలు చేసింది. 

అమరావతి: వైసిపి (ysrcp) పాలనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పోరాటానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (TDP) సిద్దమయ్యింది. ఇవాళ(సోమవారం) టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అధ్యక్షతన ఆ పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశమయ్యింది. రాష్ట్రం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నేతలు సమావేశం దృష్టికి తెచ్చారు. సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై చర్చించిన ఈ స్ట్రాటజీ కమిటీ కొన్ని తీర్మానాలు చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో ఎలాంటి కోత విధించరాదని స్ట్రాటజీ కమిటీ వైసిపి ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ఉద్యోగుల్ని బెదిరించడాన్ని టిడిపి పార్టీ ఖండించింది. ఉద్యోగులు, పెన్షనర్లు, సీపీయస్‌, అవుట్‌సోర్సింగ్‌, ఆర్టీసీ, కాంట్రాక్టు కార్మికులకు జగన్‌ రెడ్డి (ys jagan) ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం ఉద్యోగులకు రివర్స్‌ పీఆర్‌సీ ఇచ్చిందని టిడిపి నాయకులు ఎద్దేవా చేసారు. 

''టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనేక రాయితీల్లో ఈ ప్రభుత్వం కోత విధించడం సీఎం పెద్ద మనసుకు నిదర్శనమా? అల్పబుద్ధికి నిదర్శనమా? నేటి ఆర్థిక పరిస్థితి కన్నా టీడీపీ పాలనలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా వున్నా 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ఉద్యోగులకు, పించన్‌దారులకు బకాయిలు వేలల్లో చెల్లించింది. కరోనా ఉన్నా దేశంలో ఏ రాష్ట్రంలోను ఉద్యోగుల వేతనాల్లో ఇలా కోతలు పెట్టలేదు. మరి ఇక్కడ ఎందుకు పెట్టారు?'' అని స్ట్రాటజీ కమిటీ నిలదీసింది.

''ప్రభుత్వ నిధుల్ని వైసిపి నేతలు లూటీ చేశారు. దుబారా చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వం నాణ్యమైన మద్యం ఒక క్వార్టరుకు రూ.5.20 చెల్లించి మద్యం కంపెనీల వద్ద కొనుగోలు చేయగా నాసిరకమైన మద్యానికి రూ.27చెల్లించి వైసిపి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇలా మద్యం కొనుగోళ్లలో సుమారు రూ.6 వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన రాబడులను మద్యం కంపెనీలకు కట్టబెట్టి కమీషన్ల రూపంలో వేలకోట్లు దోచుకుంటున్నారు. సెంటు పట్టా పేరుతో భూములను అధిక రేట్లకు కొని రూ.7 వేల కోట్లు లూటీ చేశారు. ఇలా ఎన్నో విధాలుగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం వల్ల సమస్య వచ్చింది తప్ప కరోనా వల్ల కాదు. లూటీ, దుబారా కట్టిపెట్టి ఉద్యోగుల, పించన్‌దారుల, కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. టీడీపీ ఇచ్చిన రాయితీల్లో కోతలు కోయరాదు'' అని టిడిపి నాయకులు డిమాండ్ చేసారు.

''డిస్కమ్‌లకు ప్రభుత్వ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. కరెంటు కోతలు వెంటనే నివారించాలి. విద్యుత్‌ ఛార్జీల భారాలు తగ్గించాలి. ప్రస్తుతం పట్టణాల్లో సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల మధ్య 3 గంటలు కరెంటు కోతలు పెడుతున్నారు. గ్రామాల్లో కరెంటు కోతలు రెట్టింపుగా వున్నవి. ఆక్వా సంక్షోభం పాలవుతున్నది. రైతుల వ్యవసాయ మోటార్లు కరెంటు కోతలతో నష్టం వాటిల్లుతున్నది'' అని ఆందోళన వ్యక్తం చేసారు. 

''32 నెలల పాలనలో 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. రూ.11,611 కోట్లు ప్రజలపై భారం మోపారు. ఇదికాక విద్యుత్‌ సంస్థల ద్వారా మరో రూ.26,261 కోట్లు అప్పులు తెచ్చారు. మూడేళ్లలోనే రూ.37,872 కోట్లు ప్రజలపై భారాలు మోపారు. ఈ నిధులన్నీ ఏమయ్యాయి? గత ప్రభుత్వంతో ఒప్పందం వున్న సోలార్‌ విద్యుత్‌ సంస్థలు యూనిట్‌ విద్యుత్‌ రూ.3.80లకు ఇస్తామంటే కాదని కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో రూ.15 పెట్టి కరెంటు కొన్నారు. వినియోగదారులపై ఛార్జీలు పెంచారు'' అని ఆరోపించారు. 

''టీడీపీ ప్రభుత్వం 10 వేల మెగావాట్ల విద్యుత్‌ అదనంగా ఉత్పత్తి చేసినా కరెంటు ఛార్జీలు పెంచలేదు. కరెంటు కోతలు లేవు. మరి నేడు కరెంటు కోతలకు, ఛార్జీల మోతకు ప్రజాధనం లూటీనే కారణం తప్ప సాంకేతిక సమస్యలు కాదు. విద్యుత్‌ సంస్థల పేరుతో తెచ్చిన అప్పుల్లో రూ.6 వేల కోట్లు దారి మళ్లించారు. ప్రభుత్వం వాడుకున్న విద్యుత్‌ బకాయిలు రూ.24 వేల కోట్లు డిస్కమ్‌లకు బకాయి పెట్టింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో వున్న 20 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని సక్రమంగా వాడుకోలేదు. ఈ కారణాలతోపాటు కమిషన్ల కోసం అధిక రేట్లకు విద్యుత్‌ కొంటున్నారు. సీఎం స్వార్థపూరిత విధానాల్ని పార్టీ ఖండిస్తోంది. కరెంటు కోతలు ఆపాలి. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలి. డిస్కమ్‌లకు ప్రభుత్వ బకాయిలు వెంటనే చెల్లించాలి'' అని టిడిపి నాయకులు డిమాండ్‌ చేసారు. 

''ఇక పాఠశాలల విలీనం వల్ల చిన్న పిల్లలు దూరాభారాలు పెరిగి నష్టపోతున్నారు. టీడీపీ పాలనలో 25 నుండి 200 జనాభా కలిగి 1 కి.మీ. పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఏర్పరచింది. ప్రతి మండలంలో జూనియర్‌ కాలేజీ స్థాపించింది. ఈ విధానం మార్చి పాఠశాలలు విలీనం చేయడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కడగండ్ల పాలవుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. కనుక పాఠశాలల విలీన నిర్ణయాన్ని రద్దు చేయాలని టీడీపీ డిమాండ్‌ చేస్తున్నది'' అని స్ట్రాటజీ కమిటీలో నిర్ణయించారు. 

''భారతి సిమెంటు ప్రయోజనాల కోసం భవన నిర్మాణ రంగాన్ని దెబ్బతీయరాదు. వేలకోట్ల ముడుపుల కోసం ఉచిత ఇసుక విధానం రద్దుచేసి 4 రెట్లు ఇసుక ధర పెంచారు. సిమెంటు బస్తాపై ఈ మూడేళ్లలో రూ.150లు పెంచారు. ఇందువల్ల భవన నిర్మాణ రంగం కుదేలై దానిపై ఆధారపడ్డ 125 వృత్తులు, వ్యాపారాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులు పాధి కోల్పోయారు. కనుక సిమెంటు, ఇసుక ధరలు తగ్గించాలని పార్టీ డిమాండ్‌ చేస్తున్నది'' అన్నారు.

''టిడ్కో గృహాల పేరుతో తెచ్చిన రూ.7,300 కోట్లు దారిమళ్లించారు. ఇప్పుడు లబ్ధిదారుల పేరుతో మరో రూ.4వేల కోట్ల అప్పుకు సిద్ధం అవుతున్నారు. టీడీపీ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యవంతమైన జీవనం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో గృహాల ప్రాజెక్ట్‌ ను వైసిపి ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవడానికి వనరుగా మార్చుకుంది'' అని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. 

అప్పుల కోసం అమరావతిలోని వివిధ గ్రామాల పరిధిలో ఉన్న సుమారు 480 ఎకరాలను బ్యాంకుకు తనఖా పెట్టడం దుర్మార్గమని... మితిమీరిన అప్పుల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారన్నారు. ఉద్యోగుల పెన్‌ డౌన్‌ సమయంలోనే హడావుడిగా రిజిస్ట్రేషన్‌ చేయడాన్ని సమావేశంలో నేతలు తప్పుబట్టారు.

ఏపీపీయస్సీ, డీయస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌తో 2లక్షల 30వేల ఉద్యోగాల భర్తీకి రీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ధాన్యం, ఇతర దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. మద్యం రేట్ల పెంపుదల వల్ల కల్తీ కల్లు బారినపడి మృతి చెందిన 5 మంది ఆదివాసీ గిరిజన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టిడిపి స్ట్రాటజీ కమిటీ డిమాండ్ చేసింది.