తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ సీనియర్లతో కూడిన స్ట్రాటజీ కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

అమరావతి: గుడివాడలో క్యాసినో నిర్వహించిన విషయంలో మంత్రి కొడాలి నాని (kodali nani) అడ్డంగా దొరికిపోయారని టిడిపి అభిప్రాయ పడింది. వీడియోలతో సహా మొత్తం ఆధారాలు దొరికినా ఇంకా మంత్రి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని నేతలు అన్నారు. ఈ విషయంపై సిఎం వైఎస్ జగన్ (ys jagan) నోరు విప్పాలని టిడిపి స్ట్రాటజీ కమిటీ (TDP Strategy Committee) డిమాండ్ చేసింది. 

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అధ్యక్షతన స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. గుడివాడ క్యాసినో (casino) నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గుడివాడ క్యాసినో అంశంలో టిడిపి నేతలు చేసిన పోరాటాన్ని చంద్రబాబు ప్రశంసించారు. స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు, ప్రముఖులు జన్మించిన గుడివాడను కాసుల కోసం కక్కుర్తిపడి క్యాసినో క్యాపిటల్ గా కొడాలి నాని మారుస్తున్నారని అభిప్రాయపడ్డారు. నిజ నిర్థారణకు వెళ్లిన టిడిపి నేతలపై దౌర్జన్యం చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

క్యాసినో వంటి విష సంస్కృతిపై పోరాటం కంటిన్యూ చెయ్యాలని టిడిపి స్ట్రాటజీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. వందల కోట్లు చేతులు మారిన ఈ వ్యవహారంలో వివిధ జాతీయ ఏజన్సీలకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చెయ్యాలని నిర్ణయించారు. వైసిపి నేతల కనుసన్నల్లో, స్వయంగా మంత్రికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో గ్యాంబ్లింగ్ ఆడిన వీడియోలపై సిఎం స్పందించాలని డిమాండ్ చేశారు. కేవలం మంత్రి కొడాలి తన బూతులతో, ఎదురు దాడితో జరిగిన తప్పులను కప్పిపుచ్చలేరని నేతలు అన్నారు. 

చిత్తూరు జిల్లాలో దళిత మహిళను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడాన్ని ఈ సమావేశంలో నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ ఘటనలో కేవలం సదరు పోలీసును సస్పెండ్ చేస్తే సరిపోదని... బాధ్యులపై అట్రాసిటీ కేసులు పెట్టి విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చిత్తూరులో ఇలాంటివి నాలుగు ఘటనలు జరిగాయని నేతలు వెల్లడించారు. 

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచకపోగా...వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న విధానాలపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఉద్యోగులపై సోషల్ మీడియాలో, మీడియాలో ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేయించడం ప్రభుత్వ నైజాన్ని తెలుపుతుందన్నారు. ఉద్యోగుల డిమాండ్లకు సమావేశం మద్దతు తెలిపింది.

రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా నమోదు అవుతున్న కారణంగా...స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రమాదంలో పడేసేలా....ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. 

ఇకపోతే వివేకానంద హత్య కేసులో తెరవెనుక సూత్రధారుల లెక్కలు తేల్చకుండా...కేసును నలుగురికే పరిమితం చేసే పని జరుగుతోందని నేతలు అన్నారు. 

రాష్ట్రంలో ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తూ.. అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారన్నారు. ఎరువుల అధిక ధరలు, కొరతతో రైతాంగ ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని..దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. 

దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా లేకపోవడం రాష్ట్రంలో విధ్వంస పాలనకు నిదర్శనమన్నారు. దేశంలో బెస్ట్ సిఎంల లిస్ట్ లో కనీసం టాప్ 20 లోకూడా ఎపి సిఎం జగన్ లేకపోవడం ఆయన పాలన తీరుకు నిదర్శనం అన్నారు. పైగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు ఎక్కవ సీట్లు అంటూ సిగ్గు లేకుండా వైసిపి అసత్య ప్రచారానికి దిగుతోందని అన్నారు. 

తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుల ద్వారా, టెలిమెడిసిన్ విధానంలో కోవిడ్ బాధితులకు అవసరమైన వైద్యసాయం అందించాలని... ఈ సేవలను ప్రజలకు చేరువ చెయ్యాలని టిడిపి స్ట్రాటజీ కమిటీ నిర్ణయించింది.